NTV Telugu Site icon

Chiranjeevi Political Re-Entry: సీఎం అవ్వడానికి చిరంజీవికి ఇదే చివరి అవకాశం.. ఆయన రాకపోతే..!

Chinta Mohan

Chinta Mohan

Chiranjeevi Political Re-Entry: మెగాస్టార్‌ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలి.. తిరుపతి నుంచి పోటీ చేయాలి.. సీఎం కావాలి అనే కోరుకునే నేతల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ చింతామోహన్‌ ఒకరు.. ఇప్పటికే పలు సందర్భాల్లో.. చిరంజీవి మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలని.. తిరుపతి నుంచి పోటీ చేయాలని.. ఆయన నామినేషన్‌ వేసి వెళ్తే చాలు.. గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని గతంలో పలు మార్లు ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి చిరంజీవియే అని ప్రకటించారు కూడా.. మరోసారి చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చింతామోహన్‌.. ముఖ్యమంత్రి అవ్వడానికి చిరంజీవికి ఇదే చివరి అవకాశంగా పేర్కొన్న ఆయన.. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, చిరంజీవి ఇప్పుడు రాకపోతే పదేళ్ల పాటు కాపులు, బలిజలకు ఏ అవకాశం రాదు అని చెప్పుకొచ్చారు చింతామోహన్‌.

Read Also: Variety Fashion : ఏంటి ఇది.. నీ ఫ్యాషన్ తగలబడ.. ఎలుకల బోనులతో హీల్స్ ఏంటి తల్లి ?

విజయవాడలో మీడియాతో మాట్లాడిన చింతామోహన్‌.. తిరుపతి రాజధాని అవుతుంది, అవ్వాలని ప్రజలు కోరుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమలో కరువు పోయి అభివృద్ధి జరగాలంటే తిరుపతి రాజధానిగా మారితేనే సాధ్యం అన్నారు. సీమకు నీళ్లు లేవు.. రాళ్లు మిగిలాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, బ్రహ్మంగారు కాల జ్ఞానంలో తిరుపతి రాజధాని అవుతుందని రాశారు.. అందుకోసం అందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. తిరుపతి అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతం.. భూములు, వనరులు, ఆహ్లాదకర మైన వాతావరణం అన్నీ ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు.. మూడు రాజధానులు అని చెప్పిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మళ్లీ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అనటం ఏంటి? అని నిలదీశారు చింతామోహన్‌.. స్వార్థ ఆర్ధిక ప్రయోజనాల కోసం హైదరాబాద్‌ను విడిచిన చంద్రబాబు.. తుళ్లూరు వచ్చారని విమర్శించిన ఆయన.. భూముల కోసం వైసీపీ.. విశాఖపట్నం వెళ్లిందని ఆరోపించారు. తిరుపతి రాజధాని చేయాలని అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పినా.. సంజీవయ్య కర్నూలుకి పంపించారని.. ఆ తర్వాత రాజధాని హైదరాబాద్‌ వెళ్లిందన్నారు. తుళ్లూరు నుంచి విశాఖ వెళ్లిన రాజధాని.. ఇప్పుడు గాల్లో ఉంది అని ఎద్దేవా చేశారు మాజీ ఎంపీ చింతామోహన్‌.