S Jaishankar: జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. చైనా ఆక్రమించిందని ప్రతిపక్ష నేతలు చెబుతున్న భూమిని వాస్తవానికి 1962లోనే ఆక్రమించారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం పేర్కొన్నారు. లడఖ్లో భూభాగాన్ని కోల్పోవడంపై అధికారిక నివేదిక గురించి ఇటీవల మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. “కొన్నిసార్లు వారు తమకు తెలిసిన వార్తలను అబద్ధం అని ప్రచారం చేస్తారు. ఇది ఇప్పుడే జరిగినట్లు వారు ప్రొజెక్ట్ చేస్తారు, వాస్తవానికి ఇది 1962లో జరిగినప్పుడు … వారు దాని గురించి మాట్లాడరు,” అని ఆయన అన్నారు.
భూభాగాన్ని కోల్పోవడంపై, తూర్పు లడఖ్లోని 65 పెట్రోలింగ్ పాయింట్లలో 26కి భారతదేశం యాక్సెస్ కోల్పోయిందని లడఖ్లోని సీనియర్ పోలీసు అధికారి నివేదికను ఉదహరించిన వారిలో ఇటీవల రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరైన దేశంలోని అత్యున్నత పోలీసు అధికారుల సదస్సులో ఈ నివేదికను సమర్పించారు. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే పుణెలో శనివారం జరిగిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు.
Exam Cancelled: జూనియర్ క్లర్క్ పరీక్ష పేపర్ లీక్.. ఎగ్జామ్ రద్దు
2017లో రాహుల్ గాంధీ చైనా రాయబారితో సమావేశంపై కేంద్ర మంత్రి జైశంకర్ ఈ సందర్భంగా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాను ఏదైనా తెలుసుకోవాలంటే, ఇన్పుట్లు పొందడానికి తాను చైనా రాయబారి వద్దకు వెళ్లను అని, కానీ సైనిక నాయకత్వం దగ్గర సందేహాలను నివృత్తి చేసుకుంటానన్నారు. చైనా ప్రతినిధులను కలవడంపై స్పందించిన రాహుల్ గాంధీ స్పందిస్తూ.. కీలక అంశాలపై సమాచారం తెలుసుకోవడం నా విధి అని అన్నారు. ఈ క్రమంలోనే చైనా రాయబారి, భూటాన్ రాయబారి సహా మాజీ జాతీయ భద్రతా సలహాదారు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులను కలిశానని తెలిపారు.