NTV Telugu Site icon

China: చైనా వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై కొవిడ్‌ టెస్టులు అక్కర్లే..

China

China

China: చైనాకు వెళ్లే ప్రయాణికులు ఇకపై బుధవారం నుంచి కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. మహమ్మారి కారణంగా దాదాపు మూడు సంవత్సరాలు ఒంటరిగా ఉన్న తర్వాత ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలు తమ దేశం వచ్చేలా చేస్తున్న ప్రయత్నాలలో ఈ చర్య ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఒక నోటీసు ప్రకారం.. ప్రయాణికులు ఇకపై దేశం నుంచి వెళ్లేటప్పుడు, ప్రవేశించేటప్పుడు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

Read Also: Putin Dials PM Modi: ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్‌.. ఏం చెప్పారంటే?

జనవరిలో దేశ విదేశాల నుంచి వచ్చే చైనా పౌరులకు కొవిడ్‌ పరీక్షలు అవసరం లేదని చైనా తెలిపింది. చైనా పౌరులు ప్రయాణించగల దేశాల జాబితాను క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, దక్షిణ కొరియా, జపాన్‌తో సహా విదేశీ గమ్యస్థానాలకు గ్రూప్ టూర్‌లపై నిషేధాన్ని కూడా చైనా ఎత్తివేసింది. మూడు సంవత్సరాల జీరో-కొవిడ్‌ విధానాన్ని ముగించాలని చైనా గత డిసెంబర్‌లో నిర్ణయించింది. ఇందులో సామూహిక పరీక్షలు, కఠినమైన, నిరంతర నిర్బంధ లాక్‌డౌన్‌లు ఉన్నాయి. ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల ఆసుపత్రిలో చేరడం, మరణాలలో భారీ పెరుగుదలకు దారితీసిందని ఆరోగ్య నిపుణులు చెప్పారు. ఈ మరణాలను ప్రభుత్వం ధ్రువీకరించలేదని తెలిపారు.

2020 ప్రారంభంలో కొవిడ్‌ ఆవిర్భవించిన సమయంలో విమాన ప్రయాణాలు పూర్తిగా ఆగిపోయాయి. ప్రపంచంలోని అత్యంత కఠినమైన సరిహద్దు నియంత్రణలకు దారితీసింది. చైనా జీరో-కొవిడ్‌ విధానాన్ని రద్దు చేసినప్పటి నుంచి కొవిడ్‌ వల్ల 60,000 మంది ఆసుపత్రిలో మరణించారని.. జనవరిలో అధికారిక చైనా ప్రభుత్వ అంచనాల కంటే అదనపు మరణాల సంఖ్య చాలా ఎక్కువ అని అధ్యయనం తెలిపింది.