ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని మంగళవారం సిట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరు నుంచి శ్రీలంకకు పారిపోతుండగా.. చెవిరెడ్డిని విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆపై సిట్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. మంగళవారం రాత్రి చెవిరెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను విజయవాడకు తరలించారు. ఈ అరెస్టుపై చెవిరెడ్డి వైసీపీ కార్యకర్తలకు, నేతలకు వాయిస్ మెసేజ్ పంపారు. చంద్రబాబుకు భయం పుట్టేలా నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెవిరెడ్డి కోరారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ వెంట నడిచే వారిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, అందులో భాగంగానే తనను అరెస్టు చేశారని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తెలిపారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. జగన్ అన్న వెంట నడిచే వారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా కూడా తట్టుకుని నిలబడతా, మీ అందరి ఆశీస్సులు నాకు ఉన్నాయి. నేను ఈరోజు రిలీజ్ అవుతా. పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. పార్టీ కార్యకమాలను విజయవంతం చేయాలి. జగన్ అన్నకు మనం ఓ సైన్యంలా నిలబడాలి. ఆయన అడుగడునా వెంటే ఉండాలి’ అని చెవిరెడ్డి పిలుపునిచ్చారు.
‘చంద్రబాబు నాయుడు నన్ను జైలుకు పంపుతాడు అనే నానుడి ఉంది. ఏ సంబంధం లేని నన్ను ఈ కేసులో ఇరికించారు. వారు ఏం చేసినా.. మనం జగన్ అన్న సైనికులం, గట్టిగా నిలబడే వాళ్లమే. చంద్రబాబుకు భయం పుట్టేలా మనం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి, పార్టీ కోసం నిత్యం పని చేయాలి. నేను బయటికి వచ్చాక మళ్లీ మాట్లాడుతా. నేను, నా కుటుంబ సభ్యులు జగన్ అన్నకు సైనికులం. ప్రతి ఒకరు వెనకడుగు వేయకుండా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలి’ అని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కోరారు.