Site icon NTV Telugu

Char Dham Yatra: హిమాలయాల్లో ఆధ్యాత్మిక శోభ.. తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ద్వారాలు!

Char Dham Yatra

Char Dham Yatra

Char Dham Yatra: హిమాలయాల్లోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఉత్తరాఖండ్‌లో 2026 విడత ‘చార్ ధామ్ యాత్ర’కు రంగం సిద్ధమైంది. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం అటు ఆన్‌లైన్, ఇటు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

READ ALSO: Praful Hinge: తొలి ఓవర్‌లో 15 రన్స్.. చివరి ఓవర్‌లో కట్టడి.. మరోసారి నిరూపించుకున్న ప్రఫుల్ హింగే!

నేటి నుంచే తెరుచుకోనున్న ద్వారాలు
ఈ ఏడాది యాత్ర ఏప్రిల్ 19న అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ప్రారంభం కానుంది. అదే రోజున యమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులు తెరుచుకోనున్నాయి. ఇతర క్షేత్రాలైన కేదార్‌నాథ్ ఏప్రిల్ 22న, బద్రీనాథ్ ఏప్రిల్ 23న, హేమకుండ్ సాహిబ్ మే 23న ప్రారంభం కానున్నాయి.

రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..
యాత్రికుల రద్దీని నియంత్రించడానికి, భద్రతను పర్యవేక్షించడానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ టూరిజం అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా భక్తులు ముందుగానే పేర్లు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఆన్‌లైన్‌లో చేసుకోలేని వారి కోసం హరిద్వార్‌లోని రిషికూల్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 17 నుంచే కౌంటర్లు ప్రారంభమయ్యాయి. హరిద్వార్‌తో పాటు రిషికేశ్, డెహ్రాడూన్‌లోని వికాస్ నగర్‌లో కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. హరిద్వార్‌లో 20 కౌంటర్లు మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పనిచేస్తాయి.

కావాల్సిన పత్రాలు ఇవే..
రిజిస్ట్రేషన్ కోసం భక్తులు తమ గుర్తింపు కార్డులను (పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు) అందజేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత భక్తులకు QR కోడ్ కలిగిన ఒక పాస్ జారీ చేస్తారు. యాత్ర మార్గంలోని చెక్ పోస్టుల వద్ద ఈ పాస్‌ను చూపించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సెంటర్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కుర్చీలు, తాగునీరు, కూలర్లు, ఫ్యాన్ల వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. అలాగే, యాత్ర మార్గమంతటా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పోలీస్ అవుట్‌పోస్టులు, టూరిస్ట్ పోలీస్ సెంటర్లు, విపత్తు నిర్వహణ బృందాలు (DRF) ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వేలాది మంది భక్తులు తరలివచ్చే ఈ ఆధ్యాత్మిక యాత్రను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

READ ALSO: PAN Card New Rules: డబ్బు ఉన్నా పని జరగదు.. మీ జేబులో పాన్ కార్డ్ లేకపోతే కష్టమే! ఈ షాకింగ్ రూల్స్ తెలుసా..

Exit mobile version