NTV Telugu Site icon

Chandrababu: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు.. తుఫాన్‌ సహాయక చర్యలు చేపట్టండి

Chandrababu

Chandrababu

Chandrababu: మిచౌంగ్‌ తుఫాన్‌ తీరాన్ని తాకింది.. ఒకటి, రెండు గంటల్లో పూర్తిస్థాయిలో తీరం దాటనుంది మిచౌంగ్‌.. మరోవైపు.. తుఫాన్‌ సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ నేతలు, శ్రేణులను టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. బాధిత గ్రామాల ప్రజలతో నేరుగా ఫోన్‌లో మాట్లాడారు చంద్రబాబు. తుఫాన్‌ సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అవసరమైన చోట టీడీపీ నేతలు ఆదుకుంటారని తెలిపారు.

Read Also: Vishnu Vishal : వరదల్లో చిక్కుకున్న తమిళ హీరో.. సాయం చేసిన రెస్క్యూ టీం..

మరోవైపు, తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలకు చెందిన నేతలతోనూ చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట ఖర్చులు పెరిగాయి.. పెరిగిన సాగు ఖర్చులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నేడు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో పరిహారం పెంచి సాయం చేశాం అన్నారు. హుద్‌ హుద్‌, తిత్లీ నాటి కంటే ఎక్కువగా సాగు ఖర్చులు పెరిగాయి. పరిహారం కోసం ప్రత్యేక జీవోలు తేవాలన్నారు. ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందోననే విషయాన్ని టీడీపీ నేతలు అధికారులకు సమాచారం అందించాలి. తుఫాన్‌ బాధితులకు భోజనం సరిగా పెట్టలేరా? అని మండిపడ్డారు. తుఫాన్‌పై ప్రభుత్వ సన్నద్ధతా లేదు.. ప్రభుత్వం వైపు నుంచి బాధితులకు సాయమూ లేదని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.