Chandra Grahan 2023: చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినపుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. మన దేశ కాలమానం ప్రకారం ఇవాళ అర్థరాత్రి 1.05 నిమిషాలకు గ్రహణం ప్రారంభంకానుంది. గ్రహణ మోక్ష కాలం తెల్లవారుజామున 2 గంటల 23 నిమిషాలు. అంటే మొత్తం గ్రహణం సమయం ఒక గంట 19 నిమిషాలు. భారత్తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనిపించనుంది. భారతదేశంతో పాటు ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలు, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో గ్రహణ ప్రభావం పడనుంది. అయితే ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా.. గ్రహణం ప్రభావం తప్పకుండా భారత్పై కూడా పడబోతోందని పండితులు చెబుతున్నారు. అందుకే గ్రహణ నియమాలను పాటించాలన్నది వారి మాట.
మరోవైపు గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయ తలపులు మూసివేయడం ఆనవాయితీ కావడంతో .. నేటి రాత్రి 7.05 గంటలకు తిరుమల ద్వారాలు మూసివేస్తారు. రేపు తెల్లవారుజామున ఆలయాన్ని శుద్ధిచేసి ఏకాంతసేవ నిర్వహిస్తారు. అనంతరం భక్తులను తిరిగి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇవాళ మధ్యాహ్నం మూడున్నర వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం సమయంలో శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీతో పాటు అన్నదానం కూడా నిలిపేస్తారు. దీని తర్వాత సెప్టెంబర్ 7, 2025 సంవత్సరంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ప్రపంచ వ్యాప్తంగా కనువిందు చేయనుంది.
చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం 8 గంటల పాటు మూసివేత.. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి రేపు ఉదయం 3:15 గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు.. ఇవాళ సహస్రదీపాలంకరణ సేవ, వయోవృద్దులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.. నేడు చంద్రగ్రహణం సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రముఖ దేవాలయాల మూసివేయనున్నారు.. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి కసాపురం ఆంజనేయస్వామి ఆలయం మూసివేయనున్నట్టు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయం మూతపడనుంది.. ఇక, కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో రాత్రి 7.30 వరకూ మాత్రమే స్వామి వారి దర్శనాలు.. సంప్రోక్షణ అనంతరం ఆదివారం తెల్లవారుజామున నుండి యథావిథిగా ఆర్చనాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం మూసివేయనున్నారు.. మధ్యాహ్నం 1 గంటకు ఆలయం మూసివేసి.. రేపు తెల్లవారుజామున ఆలయం తెరచి శుద్ధి, అర్చనాది కార్యక్రమాల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు..
లేపాక్షి శ్రీ దుర్గా పాపనాశ్వేశ్వర వీరభద్ర స్వామి దేవాలయం కూడా మూతపడనుంది.. మధ్యాహ్నం మూడు గంటలకు ఆలయ తలుపులు మూసివేసి.. రేపటి రోజు ఉదయం 7 గంటలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.. నేటి సాయంత్రం పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయం మూసివేయనున్నారు.. సాయంత్రం 5 నుంచి రేపు ఉదయం 5 వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు.. ఈరోజు మధ్యాహ్నం 3.30 వరకు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుంది.. గ్రహణం కారణంగా రాత్రి జరిగే శ్రీస్వామి అమ్మవారి నిత్య కల్యాణం నిలుపుదల చేశారు.. శ్రీశైలం ప్రధానాలయం, పరివార ఆలయాలు కూడా మూతపడనున్నాయి.. వీటితో పాటు తెలంగాణలోని ప్రధాన ఆలయాలు కూడా మూసివేయనున్నారు.. మొత్తంగా ఈ రోజు సాయంత్రానికి అన్ని ఆలయాల్లో దర్శనాలు నిలిచిపోనున్నాయి.. రేపు తెల్లవారుజామున ఆలయాలు శుద్ధి చేసిన తర్వాతే తిరిగి భక్తులను అనుమతించనున్నారు..