NEET UG Re-Exam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘నీట్’ (NEET) పరీక్షల వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 21న దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ రీ-ఎగ్జామ్ (NEET UG Re-exam) జరగనున్న తరుణంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ (Telegram) పై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) తాత్కాలికంగా దేశవ్యాప్త ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా రీ-టెస్ట్ నిర్వహించేందుకు వీలుగా కేంద్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) యాక్ట్, 2000 లోని సెక్షన్ 69A కింద తన అత్యవసర అధికారాలను ఉపయోగించి ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది.
కేంద్రం జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ఈ నెల 22వ తేదీ వరకు భారత్లో టెలిగ్రామ్ యాప్ సేవలను పూర్తిగా నిలిపివేయనున్నారు. పరీక్షకు ముందు, పరీక్ష జరిగే రోజు, ఆ తర్వాత తలెత్తే పరిణామాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ఆంక్షలు విధించారు. దీనితో పాటు, టెలిగ్రామ్లోని ‘మెసేజ్ ఎడిటింగ్’ (Message-Editing) ఫీచర్ను సైతం జూన్ 30 వరకు పూర్తిగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. సాధారణంగా టెలిగ్రామ్లో పాత మెసేజ్లను ఎడిట్ చేసే అవకాశం ఉండటంతో కొందరు కేటుగాళ్లు పాత మెసేజ్లను మార్చి, “పేపర్ ముందే లీక్ అయింది” అంటూ తప్పుడు ఆధారాలు (Fabricated Evidence) సృష్టించి విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), సైబర్ క్రైమ్ విభాగాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే టెలిగ్రామ్ వేదికగా సాగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పరీక్ష పత్రాల లీకేజీలంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ, నకిలీ ప్రశ్నపత్రాల ఆశ చూపి విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న పలు అంతర్రాష్ట్ర ముఠాల గుట్టును సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రట్టు చేశారు. ఈ నేపథ్యంలో, విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పవిత్రతను కాపాడటానికి ఈ తాత్కాలిక ఆంక్షలు తప్పనిసరని ఎన్టీఏ స్పష్టం చేసింది. సామాన్య వినియోగదారులకు దీనివల్ల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ, పరీక్షల భద్రత దృష్ట్యా ఇవి అత్యంత అవసరమని అధికారులు పేర్కొన్నారు. జూన్ 21న జరిగే నీట్ రీ-ఎగ్జామ్ కోసం ఇప్పటికే కఠినమైన మిలిటరీ స్థాయి భద్రతా ఏర్పాట్లు, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఏఐ (AI) సిసిటివి నిఘా వంటి అత్యాధునిక చర్యలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ కఠిన ఆంక్షల నడుమ రీ-టెస్ట్ ప్రశాంతంగా ముగుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

