E20 Petrol: కేంద్రంలోని NDA ప్రభుత్వం తీసుకువచ్చని E20 ఇంధనం (20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్)పై ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా, సీ-ఓటర్ సర్వేలో కేంద్రానికి షాక్ తగిలింది. దేశవ్యాప్తం సర్వేలో సగానికి పైగా ప్రజలు E20 ఇంధనాన్ని ఉపయోగించేందుకు ఆసక్తి చూపించడం లేదు. జూన్ 8,9 తేదీల్లో 18 ఏళ్లకు పైబడిన 1,641 మందిపై నిర్వహించిన సర్వేలో 52 శాతం మంది E20కి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. కేవలం 22 శాతం మాత్రమే మద్దతు తెలిపారు. మరో 25.9 శాతం మంది స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు.
సర్వే ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఓటు వేసిన వారిలో 53 శాతం మంది E20 పెట్రోల్ ఉపయోగించేందుకు ఇష్టపడటం లేదు. దాదాపు 55 శాతం మంది ఈ పెట్రోల్ వాడటం వల్ల వాహనాల నష్టం కలుగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 52.8 శాతం మంది ఇంజన్ దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో 76 శాతం మంది సాధారణ పెట్రోల్తో పాటు E20ని కూడా అందుబాటులో ఉంచి, వినియోగదారులు తమకు నచ్చిన ఎంపికకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో E20 ధర, సాధారణ పెట్రోల్ కన్నా తక్కువగా ఉండాలని చెప్పారు.
పాత వాహనాలకు E20ని తప్పనిసరి చేయడం సరికాదని 56.3 శాతం మంది చెప్పారు. బీజేపీ ఓటర్లలో 49.2 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 43 శాతం మంది బీజేపీ ఓటర్లు E20 వల్ల భారత్ చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గి, దేశ ఇంధన భద్రత బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే, కేంద్రం మాత్రం E20 విధానానికి మద్దతు తెలుపుతోంది. దీని వల్ల వాహనాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. మరోవైపు, రైతులకు కూడా మేలు కలుగుతుందని కేంద్రం చెబుతోంది. ఇథనాలు కలపడం వల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని వెల్లడిస్తోంది.

