Business Headlines 02-03-23:
ఏపీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్
ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి 2 రోజులు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగనుంది. శుక్రవారం, శనివారం నిర్వహిస్తున్న ఈ సదస్సుకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఓడరేవు ఆధారిత పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించటంపై దృష్టిపెట్టనున్నట్లు చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక వనరుల నుంచి పంప్డ్ స్టోరేజ్ పద్ధతిలో పవర్ జనరేట్ చేసే ఇండస్ట్రీలు రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మిట్కి అంబానీ, బిర్లా, జిందాల్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరవుతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
హైదరాబాద్లో లుపిన్ ల్యాబ్
ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీ.. లుపిన్ లిమిటెడ్.. హైదరాబాద్లో కొత్తగా రీజనల్ రిఫరెన్స్ ల్యాబ్ను ప్రారంభించింది. దీంతో.. సౌత్ ఇండియాలో ఈ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. లుపిన్ డయాగ్నోస్టిక్స్కి దేశం మొత్తమ్మీద 380 శాంపిల్ కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 15 కేంద్రాలు భాగ్య నగరంలోనే ఉండగా ఈ సంఖ్య మూడేళ్లలో 100కు చేరనుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల్లో 200 సెంటర్లను ఏర్పాటుచేయాలని టార్గెట్ పెట్టుకుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చే కేంద్రాల్లో 75 వరకు తెలంగాణలోనే రానున్నాయని సంస్థ సీఈఓ రవీంద్ర కుమార్ చెప్పారు.
ఆఫీసుకి రావటం అవసరం
ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకి బంద్ పెట్టి ఆఫీసుకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ పేర్కొన్నారు. ఆఫీసుకి రావటం వల్ల ఉద్యోగుల మధ్య వర్క్ రిలేషన్ పెరుగుతుందని తెలిపారు. ఉద్యోగులను మానసికంగా ఒక్కటి చేయటం అనేది టెక్నాలజీ వల్ల అసాధ్యమని అన్నారు. సాంకేతిక పరిశ్రమ బాగా చెడిపోయిన రంగాల్లో ఒకటి కాబట్టే ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం కల్చర్ని ఎంజాయ్ చేస్తున్నారని కాస్త కటువుగానే చెప్పారు. కాబట్టి తన అభిప్రాయంతో ఏకీభవించి సాధ్యమైనంత ఎక్కువ మంది ఉద్యోగులు ఆఫీసులకు వస్తారని భావిస్తున్నట్లు రిషద్ ప్రేమ్జీ ఆశాభావం వెలిబుచ్చారు.
5జీతో 115% పెరిగిన స్పీడ్
5జీ టెక్నాలజీ ప్రవేశం వల్ల భారతదేశంలో మొబైల్ డేటా స్పీడ్ ఏకంగా 115 శాతం పెరిగింది. దీంతో.. స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 49 పాయింట్లు మెరుగుపడింది. తాజాగా.. 69వ స్థానానికి ఎగబాకింది. జీ20 దేశాల్లో రష్యా, అర్జెంటీనాల కన్నా ముందు వరుసలోకి వచ్చింది. ఈ విషయాలను ఊక్లా రిపోర్ట్ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్లో ఇండియాలో మొబైల్ డేటా యావరేజ్ డౌన్లోడ్ స్పీడ్ 13 పాయింట్ ఎనిమిదీ ఏడు ఎంబీపీఎస్ మాత్రమే ఉండగా ఈ ఏడాది జనవరిలో 29 పాయింట్ ఎనిమిదీ ఐదుకి పెరిగింది.
జీఎస్టీ వసూళ్లలో 12% వృద్ధి
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్.. జీఎస్టీ వసూళ్లు పోయినేడాది ఫిబ్రవరితో పోల్చుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 శాతం పెరిగాయి. తద్వారా లక్షా 49 వేల 557 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. సెస్ కలెక్షన్లు రికార్డు స్థాయిలో 11 వేల 931 కోట్ల రూపాయలు వచ్చాయి. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ రేంజ్లో సుంకాలు వసూలు కావటం ఇదే మొదటిసారి. ఈ ఏడాది జనవరి కన్నా ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ నిన్న బుధవారం విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. జీఎస్టీ ఆదాయం వరుసగా 12 నెలల నుంచి ఒకటీ పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లకు పైగానే వస్తుండటం విశేషం.
జెనెటిక్ మ్యాపింగ్లోకి అంబానీ
ముఖేష్ అంబానీ వ్యవహారం చూస్తుంటే.. కాదేదీ వ్యాపారానికనర్హం అన్నట్లుంది. ఆయన తాజాగా జెనెటిక్ మ్యాపింగ్ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు. దేశంలోని ఒకటీ పాయింట్ 4 బిలియన్ల మంది జన్యు పటాలను సరసమైన ధరలకే తయారుచేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా ఒక టెస్ట్ కిట్ని కేవలం 12 వేల రూపాయలకే అందుబాటులోకి తేనున్నారు. తద్వారా ప్రతిఒక్కరి బయలాజికల్ డేటాను క్రియేట్ చేసి, దాని ఆధారంగా ఔషధాల అభివృద్ధిని చేపట్టాలని, ఫలితంగా వ్యాధుల సమూల నివారణకు పూనుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.