Breaking News : బీఆర్ఎస్ పార్టీలో పెరుగుతున్న అంతర్గత కలహాల నడుమ, ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవల్లి ఫాం హౌస్కి వెళ్లినట్లు సమాచారం. ఈ భేటీలో కవిత లేఖతో పాటు, ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై వచ్చిన నోటీసుల అంశాలను చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ నేత ఈటల రాజేందర్లకు అధికారిక నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్కతుర్తి సభ అనంతరం కవిత తన తండ్రికి రాసిన లేఖ, ఆ సభలో కనిపించిన పాజిటివ్, నెగిటివ్ అంశాలు, పార్టీ నేతల చుట్టూ ‘దెయ్యాల’ ఉన్నారన్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
ఇప్పటికే హరీష్ రావు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం ఉండగా, కేటీఆర్ సర్దిచెప్పారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలి అనే దానిపై ఇంటి పోటీ చెలరేగినట్లు విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య అధికారం కోసం మౌన పోరాటం సాగుతోందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అభిప్రాయం. ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకేందుకు, అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు కేటీఆర్ – కేసీఆర్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు.