టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం ఒకటే ట్రెండ్ నడుస్తోంది. అదే ‘వైలెన్స్’. సినిమా టైటిల్ కార్డ్ పడినప్పటి నుండి ఎండ్ కార్డ్ వరకు తెరపై రక్తం ఏరులై పారాల్సిందే. కత్తులతో ఊచకోత కోస్తేనే కలెక్షన్స్ వస్తాయని, గన్ కల్చర్ను చూపిస్తేనే బాక్సాఫీస్ మురిసిపోతుందని మేకర్స్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు కథ కంటే మితిమీరిన హింసకే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో సామాన్య ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.
Also Read : Anushka Shetty : అనుష్క ఏం చేస్తుంది.. సినిమా కెరీర్కు ఎండ్ కార్డ్ పడినట్టేనా?
ఇటీవల కాలంలో భారీ అంచనాలతో వచ్చిన రజనీకాంత్ ‘కూలీ‘, బాలకృష్ణ ‘అఖండ 2‘ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. కేవలం భారీ యాక్షన్ సీక్వెన్స్లు, రక్తపాతం నమ్ముకున్న ఈ చిత్రాలు కథా లోపం వల్ల బాక్సాఫీస్ వద్ద ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ మేకర్స్ తీరు మారడం లేదు. రాబోయే ‘కల్ట్’, ‘టాక్సిక్‘ వంటి చిత్రాల టీజర్లు చూస్తుంటే అవి వైలెన్స్కు పరాకాష్టగా నిలుస్తాయని స్పష్టమవుతోంది. సందీప్ రెడ్డి వంగా తీసిన ‘యానిమల్‘ చిత్రంలో క్లైమాక్స్ సీన్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది కేవలం హింసను గ్లోరిఫై చేయడమేనని మేధావులు మండిపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ కమర్షియల్గా వర్కవుట్ అయినప్పటికీ అందులో చూపించిన హింస హద్దులు దాటిందనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు నాని నటిస్తున్న ‘ప్యారడైజ్‘, విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్‘ చిత్రాలు కూడా ఇదే బాటలో పయనిస్తూ రక్తపాతం సృష్టిస్తాయా అన్న ఆందోళన నెలకొంది. సినిమా అంటే ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి చూసే వినోదం. కానీ, ఇప్పుడు థియేటర్లలో కనిపిస్తున్న ‘ఓవర్ యాక్షన్’ మరియు అతి హింస వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడుతున్నారు. కేవలం మాస్ ప్రేక్షకులను, యూత్ను ఆకట్టుకోవాలనే తాపత్రయంలో దర్శకులు హుందాతనాన్ని మరిచిపోతున్నారు. కథలో దమ్ము లేనప్పుడు కేవలం రక్తాభిషేకం చేస్తే సినిమాలు హిట్టయిపోవు అనే నిజాన్ని మేకర్స్ ఎప్పుడు గ్రహిస్తారో చూడాలి.