పాకిస్థాన్లో (Pakistan) సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది (Election Day). అయితే ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందని అనుకుంటున్న సమయంలో బలూచిస్థాన్ (Balochistan), ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్స్లో రెండు చోట్ల పేలుళ్లు సంభవించాయి. బలూచిస్థాన్లో రోడ్డు పక్కనే దాడి జరిగినట్లు సమాచారం. ఈ పేలుడులో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. ఇక ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఒక పోలీసు మరణించాడు.
పాకిస్థాన్ వ్యాప్తంగా 90 వేల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఓటింగ్ పూర్తవ్వగానే లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు.
ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్, బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), ఇమ్రాన్ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. షరీఫ్కు చెందిన పీఎంఎల్ (ఎన్) ఈ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జైల్లో ఉన్న ఆయన పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేసినట్లు పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు రోజు బలూచిస్థాన్లో జరిగిన రెండు పేలుళ్లలో 30 మంది మృతిచెందగా.. 52 మంది గాయపడ్డారు.
ఇది కూడా చదవండి:Sujana Chowdary: చంద్రబాబు-అమిత్ షా-జేపీ నడ్డా భేటీ.. సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు