ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చొరవను అభినందిస్తూ గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్గేట్స్ లేఖ రాశారు. ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ బృందంతో జరిగిన ఒప్పందం, సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. సీఎంపై బిల్గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ వచ్చినందుకు సీఎం చంద్రబాబు, బృందంకు ధన్యవాదాలు చెప్పారు. మంచి వాతావరణంలో సంప్రదింపులు జరిగాయని బిల్గేట్స్ లేఖలో పేర్కొన్నారు. పేదలు-అట్టడుగువర్గాల విద్య, ఆరోగ్యంలోనూ.. వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిపైనా గేట్స్ ఫౌండేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నాను అని బిల్గేట్స్ రాసుకొచ్చారు.
Also Read: Jangareddigudem Deaths: జంగారెడ్డి గూడెం కల్తీ మద్యం మరణాలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
‘ఆరోగ్యరంగాన్ని పటిష్ట పరచడం, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, ఏఐ అసిస్టెడ్ క్లినికల్ డిసిషన్ మేకింగ్, మెడ్టెక్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా ఏపీని తీర్చిదిద్దడంపై చర్చ జరిగింది. వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాల తయారీ, సాయిల్ హెల్త్ మోనిటరింగ్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి మైక్రోన్యూట్రీయంట్లు అందించే అంశాలపై ఇరువురం చర్చించాం. పాలనలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ను బలోపేతం చేసేందుకు.. మెరుగైన సేవలు అందించేందుకు మీరు చూపిన ఆసక్తి మీ చిత్తశుద్ధికి, విజన్కు నిదర్శనం. మీరు ఆశించే ఏఐ డ్రివెన్ డిసిషన్ మేకింగ్, రియల్ టైమ్ డేటా సిస్టమ్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ వంటివి మీ నాయకత్వ ప్రతిభను ప్రస్ఫుటం చేస్తున్నాయి. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు మీరు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్కే కాదు భారత్ సహా అల్పాదాయ దేశాలకు ఉపయోగపడుతుంది . ఈసారి నా భారతదేశ పర్యటనలో ఆంధ్రప్రదేశ్కు వచ్చేనాటికి మీ నాయకత్వం-మన భాగస్వామ్యంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో అద్భుతమైన పురోగతి సాధించగలమని చెప్పగలను. గేట్స్ ఫౌండేషన్-ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యం మున్ముందు కొనసాగాలని, కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర భవిష్యత్పై సానుకూల ప్రభావాన్ని చూపాలని ఆశిస్తున్నాను’ అని బిల్గేట్స్ లేఖలో పేర్కొన్నారు.
