Bhojshala case: మధ్యప్రదేశ్ హైకోర్టు ‘‘భోజ్శాల కేసు’’లో సంచలన తీర్పు వెలువరించింది. ధార్లోని ఈ భోజ్శాల సరస్వతీ దేవీ ఆలయంగా హైకోర్టు గుర్తించింది. మందిర్-మసీదు కేసుల్లో ఈ కేసు కూడా దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ కేసులో హిందూ పక్షానికి కీలక విజయం లభించింది. హిందువులకు పూజ చేసుకునే అవకాశం లభించింది. సరస్వతీ దేవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచించింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు ఈ కేసులో భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) రిపోర్టును ప్రస్తావించింది. ఇది ఒక సంస్కృత విద్యా కేంద్రంగా హైకోర్టు పేర్కొంది. ముస్లింలు మసీదు కోసం ప్రభుత్వాన్ని స్థలం కోరవచ్చని చెప్పింది.
జైన్ సమాజ్, ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. న్యాయవాది విష్ణు శకంర్ జైన్ మాట్లాడుతూ.. ఈ కేసులో హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని, హిందూ భక్తులకు కోర్టు హక్కుల్ని కల్పిస్తుందని చెప్పారు. హిందూ పక్షం తన వాదనల్ని వినిపిస్తూ ఖిల్జీ ఆదేశాల మేరకు ఆలయాన్ని కూల్చివేశారని, పరమార వంశానికి చెందిన రాజు భోజుడు క్రీ.శ. 1034వ సంవత్సరంలో భోజ్శాల ప్రాంగణంలో సరస్వతీ దేవికి అంకితం చేస్తూ ఒక ఆలయాన్ని నిర్మించారని కోర్టుకు విన్నవించారు. క్రీ.శ. 1305లో అల్లావుద్దీన్ ఖిల్జీ ఆదేశాల మేరకు ఈ ఆలయం కూల్చివేయబడిందని, ఆ తర్వాత ఆ ఆలయ శిథిలాలను ఉపయోగించి అక్కడ ఒక మసీదు నిర్మించబడిందని చెప్పారు.
ఏఎస్ఐ సర్వే, శాస్త్రీయ అధ్యయనాలపై ఆధారపడి తీర్పు చెప్పింది. జూలై 2024లో, వివాదాస్పద భోజ్శాల-కమల్ మౌలా మసీదు సముదాయంపై ఏఎస్ఐ తన శాస్త్రీయ సర్వే నివేదికను మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్కు సమర్పించింది. చాలా ఏళ్లుగా హిందువులు ప్రతీ మంగళవారం పూజలు చేసుకునేందుకు, ముస్లింలు ప్రతీ శుక్రవారం ప్రార్థనలు చేసుకోవడానికి ఏఎస్ఐ అనుమతించింది. ఈ వివాదాస్పద స్థలంలో హిందువుల పూజలు ఎన్నడూ ఆగలేదని హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. హిందువుల ఆరాధన హక్కులను పరిమితం చేస్తూ, ముస్లిం సమాజాన్ని ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించిన 2003 నాటి ఏఎస్ఐ ఉత్తర్వును హైకోర్టు రద్దు చేసింది. 2023 నాటి ఉత్తర్వులు హిందువుల హక్కుల్ని పరిమితం చేసిందని, అందువల్ల అది చెల్లదని కోర్టు పేర్కొంది.
