OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి

  • భోగాపురం సంరంభంలో వినిపించని అసంతృప్త స్వరాలు
  • మెల్లిగా బయటపడుతున్న నెల్లిమర్ల టీడీపీ నేతలు
  • ఉద్యమంలో భాగమైన మమ్మల్ని పట్టించుకోలేదన్న అసంతృప్తి
  • ఎయిర్‌పోర్ట్‌ కోసం ఉద్యమాలు చేశామంటూ రీల్‌ రివైండ్‌
Otr

Otr

OTR: భోగాపురం విమానాశ్రయ ప్రారంభ సంరంభంలో ఆ స్వరాలు ఎవ్వరికీ వినిపించకుండా పోయాయా? వాళ్లు గొంతెత్తి అరిచినా… ఆ హంగామా హోరులో అరణ్య రోదనగానే మిగిలిపోయిందా? ఆది నుంచి అత్యంత కీలకంగా వ్యవహరించిన ఆ నేతల్ని చివరికి కూరలో కరివేపాకులా తీసి పక్కన పడేశారా? ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు పెత్తనాలు చేస్తుంటే మేం వెర్రోళ్ళలాగా చూడాల్సి వచ్చిందంటున్న ఆ నాయకులు ఎవరు? ఏంటి వాళ్ళ ఆవేదన? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం… రాష్ట్రానికి గర్వకారణమైన వేడుకగా ప్రచారంలోకి వచ్చింది. అందుకు తగ్గట్టే….అట్టహాసంగా కార్యక్రమం జరిగింది. ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం, గిన్నిస్‌ రికార్డులకెక్కిన గిరిజన నృత్యం… ఇలా ఓ రేంజ్‌లో జరిగింది ప్రోగ్రామ్‌. అయితే… ఆ సందట్లో కనిపించకుండా, వినిపించకుండాపోయిన కొన్ని అసంతృప్త స్వరాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. అదీ కూడా అధికార టీడీపీ నేతలవే కావడం ఇంకా ఆసక్తి రేపుతోంది.

ముఖ్యంగా… మా నియోజకవర్గంలో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మాకు ప్రాధాన్యం దక్కలేదంటూ… నెల్లిమర్ల తెలుగుదేశం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అసలు భోగాపురం విమానాశ్రయ ఉద్యమంలో భాగమైన వారికే ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం రాలేదంటూ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు స్థానిక నాయకులు. పాస్‌ల పంపిణీ, ప్రోటోకాల్ వ్యవహారాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్యక్రమ ప్రధాన వేదిక దరిదాపులకు కూడా స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఉద్యమంలో భాగమైన పలువురిని రానివ్వలేదని చెబుతున్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న మాకు, ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా రాలేదంటూ ఆవేదనగా మాట్లాడుకుంటున్నారు నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు. జిల్లాలో పాస్‌ల పంపిణీ కూడా పరిమితంగా జరిగిందని, కీలకమైన వాళ్ళను కూడా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు స్థానిక నాయకులు, కార్యకర్తలు కార్యక్రమ ప్రాంగణం వెలుపలే ఉండాల్సి వచ్చిందని, ఇది చాలా అవమానకరంగా ఉందంటూ స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి.విమానాశ్రయం కోసం భూములు ఇవ్వడానికి రైతుల్ని ఒప్పించడానికి మేం ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. అలాంటి మమ్మల్ని పూచికపుల్లతో సమానంగా తీసి పడేస్తారా అంటూ కొందరు స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. తమ అనుచరులను కార్యక్రమానికి తీసుకెళ్లలేకపోవడంతో…వాళ్ళు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కొంతమంది నాయకులు సతమతం అవుతున్నారట.

ఈ కారణంగా…. కొందరు నాయకులు నియోజకవర్గాల్లో ప్రజలను, కార్యకర్తలను కలవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. మన భోగాపురం ఎయిర్‌పోర్టు అని గొప్పగా చెప్పుకుంటున్నారు తప్ప…. అది ఉన్న జిల్లాకే తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి కూడా కొందరు టీడీపీ నాయకులు, అభిమానుల్లో కనిపిస్తోందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈ అంశంపై అసంతృప్తి మరింత తీవ్రంగా ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కార్యక్రమంలో స్థానిక నాయకత్వానికి తగిన గుర్తింపు లభించలేదంటూ కొందరు కార్యకర్తలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇది క్రమంగా పెరిగి ఎక్కడ తేడా కొడుతుందోనని మరో వర్గం నాయకులు ప్యాచ్‌ వర్క్‌ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రారంభోత్సవానికి స్వయంగా ప్రధాన మంత్రి వచ్చినందున భద్రతా కారణాలు, ప్రోటోకాల్‌ పరిమితులు ఉంటాయని, ఆ కారణంగానే ఎక్కువ మందిని డయాస్‌ దగ్గరకు రానివ్వలేందటూ సర్ది చెప్పే ప్రయత్నం జరుగుతోంది. ఏదేమైనా కష్టాలు మావి, సంతోషాలు వాళ్లావా అంటున్న లోకల్‌ లీడర్స్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పే వాళ్ళు మాత్రం లేకుండా పోయారు. ఈ అసంతృప్తి ఇక్కడితో చల్లారుతుందా లేక నివురుగప్పిన నిప్పులా ఉండి సందర్భం వచ్చినప్పుడు బయటపడుతుందా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.