ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. విజయనగరం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సర్వీసులు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ప్రయాణికుల రాకపోకలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల సాకారమైనట్లయింది. భోగాపురం విమానాశ్రయానికి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇండిగోకు చెందిన 6E 6408 విమానం చేరుకుంది. ఉదయం 6:44 గంటలకు వచ్చిన ఈ విమానం కొత్త విమానాశ్రయంలో తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్గా నిలిచింది. విమానాశ్రయంలో తొలి ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు.
జీఎంఆర్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే విమాన సర్వీసుల సందడి ప్రారంభమైంది. తొలుత స్కూట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం భోగాపురం నుంచి సింగపూర్కు బయలుదేరింది. అనంతరం సోమవారం ఉదయం నుంచి దేశీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. తొలి రోజు భోగాపురం నుంచి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాలకు విమానాలు బయలుదేరనున్నాయి. ఉదయం 7:30 గంటల తర్వాత హైదరాబాద్కు తొలి విమానం వెళ్లనుండగా.. ఉదయం 8 గంటలకు బెంగళూరుకు, 8:20 గంటలకు ఢిల్లీకి, 8:50 గంటలకు హైదరాబాద్కు విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
భోగాపురం విమానాశ్రయం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్కతా, ముంబై వంటి ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు నడవనున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి దేశీయ విమానయాన సంస్థలతో పాటు ఎయిర్ ఇండియా, స్కూట్ ఎయిర్లైన్స్ ద్వారా సింగపూర్కు, ఇండిగో ద్వారా అబుధాబికి కూడా విమాన ప్రయాణ సౌకర్యం కలగనుంది. తొలి రోజైన సోమవారం మొత్తం 31 విమాన సర్వీసులు భోగాపురం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వీటి ద్వారా సుమారు 6 నుంచి 7 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. దీంతో భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కీలక రవాణా కేంద్రంగా మారనుంది.
విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణికులు సులభంగా చేరుకునేందుకు 20 విద్యుత్తు బస్సులను కూడా ఏర్పాటు చేశారు. కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులు విస్తరించడంతో రానున్న రోజుల్లో ఈ విమానాశ్రయం మరింత కీలకమైన ఏవియేషన్ హబ్గా ఎదిగే అవకాశం ఉంది.

