NTV Telugu Site icon

Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఓ రేంజ్‌లో బెట్టింగ్‌.. రూ. 2,500 కోట్ల పైమాటే..!?

Betting

Betting

Telangana Assembly Elections 2023: ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి రేపుతున్నాయి.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలా ఉన్నా.. గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది.. అత్యంత ఉత్కంఠగా మారిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ సంస్థలు ఒక పార్టీకే జైకొట్టినా, మరికొన్ని మాత్రం అధికార పార్టీకే వీర తిలకం దిద్దాయి. ఇంకొన్ని హంగ్ తప్పదని ఢంకా బజాయిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం కొంచెం ఇష్టం. కొంచె కష్టమన్నట్టుగా సస్పెన్స్ గా కనిపించడంతో, బెట్టింగ్ బిజినెస్ కు మాంచి ఊపునిచ్చింది. తెలంగాణ ఫలితాలపై కాయ్‌రాజాకాయ్ అంటున్నారు. బెట్టింగ్‌లకు పాపులరైన భీమవరంలో అయితే కోట్లలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని భీమవరం, నరసాపురం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, తాడేపల్లిగూడెంతో పాటు విజయవాడ, గుంటూరు, విశాఖలోనూ కోట్లలో బెట్టింగ్ రాయుళ్లు సై అంటే సై అంటున్నారు.

Read Also: China Virus: చైనాలో కొత్త వైరస్.. అమెరికా అప్రమత్తం.. రాకపోకలు నిషేదం..

తెలంగాణలో బెట్టింగ్‌లపై పోలీసు నిఘా ఉండడంతో ఏపీతో పాటు ఇతర ప్రాంతాల్లో బుకీలు బెట్టింగ్‌ దందాను నడిపిస్తున్నారు. ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నుంచి బెట్టింగ్‌లు కలుపుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇంగ్లండ్‌లోని ప్రధాన నగరాల నుంచి యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు జరుగుతున్నాయని తెలుస్తోంది. పందాల పేరు చెబితే గుర్తుకొచ్చే భీమవరంలో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేదానిపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఎవరి స్థోమతకు తగ్గట్లు వారు వందలు, వేలు, లక్షలు, కోట్లు బెట్‌ ఆడుతున్నారు. ఒక్క భీమవరంలో పలు అంశాల ప్రాతిపదికగా రెండు వందల కోట్ల రూపాయలకు పైగా బెట్‌ కాసినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇలా బెట్‌ కాసేవారిలో రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులతో సామాన్యులు సైతం న్నారు. ఒక పార్టీ గెలుపుపైనా, కీలక నేతల విజయమైతే లక్షకు రెండు లక్షలు, కోటికి రెండు కోట్ల చొప్పున రెట్టింపు పందేలు నడుస్తున్నాయి.

Read Also: AP And Telangana Water War: జలం జగడం.. కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ.. ఆపే ప్రశ్నేలేదు..!

ఎన్నికలపై అనేక అంశాలపై బెట్టింగ్స్ జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్ కొడుతుందా? తొలిసారి కాంగ్రెస్‌ గెలుస్తుందా? అన్నదానిపై ప్రధానంగా బెట్లు కడుతున్నారు. సీఎం అయ్యేది కేసీఆరా? కాంగ్రెస్ లీడరా? అనేదానిపైనా కోట్ల రూపాయల్లో బెట్లు నడుస్తున్నాయి. ఈసారి తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఎంఐఎం ఎప్పటిలానే ఏడు సీట్లు గెలుస్తుందా? లేదా? అనేదానిపైనా జోరుగా పందేలు సాగుతున్నాయి. కామారెడ్డి, గజ్వేల్‌లో గెలుపెవరనేదానిపై ఓ రేంజ్‌లో బెట్లు కడుతున్నారు. అటు కామారెడ్డి, గజ్వేల్‌ రెండు చోట్ల కేసీఆర్‌ గెలుస్తారా? లేదా..? అనేదానిపై భారీగా పందేలు ఆడుతున్నారు. కేసీఆర్‌, రేవంత్‌, ఈటల మెజార్టీలపైనా లక్షలు, కోట్లలో బెట్టింగ్ కాస్తున్నారు. కేటీఆర్‌ మెజార్టీలపైనా జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.

Read Also: Tirupati: కళ్యాణ మండపంలో చోరి.. బంగారం, నగదుతో ఉడాయించిన మహిళలు

హైదరాబాద్‌ సెగ్మెంట్లపైనా బెట్లు నడుస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌ గెలుస్తాడా లేదా? నాంపల్లిలో గెలిచేదెవరు ఇలా ఎన్నో రకాలుగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరి బరిలోకి దిగిన పొంగులేటి, తుమ్మల గెలుపుపైనా, మెజార్టీలపైనా భారీగా పందేలు నడుస్తున్నాయి. ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలపైనా జోరుగా పందేలు కాస్తున్నారు. ఈసారి కొంతమంది ప్రత్యేకంగా సర్వే నివేదికల ఆధారంగా బెట్లు కడుతున్నారు. ఇందుకోసం ఏజెన్సీలతో కొంతమంది సర్వేలు చేయిస్తే, మరికొంతమంది సర్వే నివేదికలను కొనుక్కుని మరీ పెద్ద మొత్తంలో పందేలు కాస్తున్నారు. ఈజీ మనీ కావడంతో జోరుగా బెట్లు కడుతున్నారు. నగదుతో పాటు ఇల్లు, పొలం, స్థలాలను బెట్టింగ్‌లో పెడుతున్నారు. నరసాపురానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త అయితే ఏకంగా సర్వే చేయించుకుని మరీ బెట్టింగ్‌ బరిలోకి దిగారట. మొత్తానికి తెలంగాణ ఎన్నిలకపై వందల కోట్ల బెట్టింగ్ లు సాగతున్నాయి.