కర్ణాటక, మహారాష్ట్రల మధ్య రవాణా కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తూ బెంగళూరు-ముంబై నగరాల మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. గత 30 ఏళ్ల కాలంలో ఈ రెండు ప్రధాన మెట్రో నగరాల మధ్య ఒక కొత్త రైలును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ అరుదైన వేడుకలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త రైలు సర్వీసు (నంబర్లు 16553/16554) బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) నుంచి ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) మధ్య వారానికి రెండు రోజులు (బై-వీక్లీ) నడవనుంది.
త్వరలోనే వందే భారత్ స్లీపర్ సర్వీస్..
ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ.. ఉత్తర, దక్షిణ కర్ణాటక ప్రజల దశాబ్దాల నాటి సుదీర్ఘ నిరీక్షణకు, రవాణా డిమాండ్లకు ఈ రైలు ద్వారా పరిష్కారం లభించిందన్నారు. అంతేకాకుండా, ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత ఆధునిక ‘వందే భారత్ స్లీపర్’ రైలు సర్వీసును కూడా బెంగళూరు-ముంబై మధ్య అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు.
గడిచిన కొన్నేళ్లలో కర్ణాటక రాష్ట్రానికి కేంద్రం నుంచి రైల్వే నిధుల కేటాయింపు గణనీయంగా పెరిగిందని, దీనివల్ల పెండింగ్ ప్రాజెక్టుల పనులు వేగవంతమయ్యాయని మంత్రి తెలిపారు. 2014 నుండి ఇప్పటివరకు కర్ణాటకలో దాదాపు 1,750 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ల నిర్మాణం పూర్తయింది. అత్యంత సంక్లిష్టమైన హాసన్-మంగళూరు సెక్షన్లో విద్యుద్దీకరణ పనులు పూర్తయి, ప్రస్తుతం ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి.
రాష్ట్రంలోని 61 రైల్వే స్టేషన్లను రూ.2,160 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నారు. ఇందులో భాగంగా బెంగళూరు కాంటోన్మెంట్ స్టేషన్ను రూ.485 కోట్లతో, యశ్వంతపూర్ స్టేషన్ను రూ.367 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్ట్ పరిధిలోని నాలుగు కారిడార్ల పనులు వేగంగా సాగుతున్నాయని, ఇది పూర్తయితే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ఐటీ హబ్లకు రవాణా మరింత సులువు కానుందని మంత్రి వివరించారు.
