Site icon NTV Telugu

AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళలు ఒక్కొక్కరికి రూ.24 వేలు

Ap Govt

Ap Govt

AP News: గత వైసీపీ ప్రభుత్వంలో బీసీ వర్గాలకు అందుబాటులో లేని సంక్షేమ పథకాలు, రాయితీల దృష్ట్యా కూటమి ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కొత్త పథకాలలో ముఖ్యంగా మహిళలకు ఆర్థిక మద్దతు కల్పించేందుకు పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం కీలకంగా భావిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించగా, సీఎం చంద్రబాబు ఆమోదం పొందగానే వాటిని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఇప్పటికే మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణను అందించడంపై సన్నాహాలు ప్రారంభించగా, యువతకు జనరిక్ మందుల షాపుల ఏర్పాటు ప్రక్రియ కూడా ముందుకు సాగింది. ఈ చర్యలు బీసీ వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించడంలో సహాయపడతాయి.

2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం బీసీ వర్గాలకు అందించిన పథకాలను తిరిగి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించవలసిన ఆదేశాలు బీసీ సంక్షేమ శాఖకు ఇచ్చింది. ఇందులో భాగంగా, టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థల నుండి టెండర్లను ఆహ్వానించింది. నైపుణ్యాభివృద్ధి కింద ఒప్పందాలు కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 80,000 మంది బీసీ మహిళలకు లాభం చేకూరనుంది. 90 రోజుల టైలరింగ్ శిక్షణ పూర్తిచేసిన మహిళలకు ఒక్కొక్కరికి రూ.24,000 విలువ గల కుట్టుమిషన్ ఉచితంగా అందించబడుతుంది. ఈ కోసం దరఖాస్తులను ఓబీఎంఎస్ సైట్ ద్వారా స్వీకరించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

సంక్షేమ పథకాలు కూడా నిరుద్యోగ యువతకు ఊరట కలిగిస్తాయి. సిటీలకు వెళ్లే సౌకర్యం లేక ఉన్న ఊళ్లలో నిరుద్యోగంగా ఉన్న బీసీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జనరిక్ మందుల షాపులు ప్రారంభించేందుకు యువతకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ షాపుల ద్వారా మందుల వాడకం పెంచడమే కాక, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన వారికి రూ.8 లక్షల రుణం అందించే అవకాశాన్ని బీసీ సంక్షేమ శాఖ కల్పిస్తోంది. ఇందులో రూ.4 లక్షలు సబ్సిడీగా అందించనున్నారు. సీఎం అనుమతి పొందగానే ఈ పథకాలు అమలులోకి రానున్నాయి.

Komuravelle: రేపు మల్లికార్జున స్వామి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు

Exit mobile version