Coaching Staff: భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు.. ఆ ఇద్దరికి బీసీసీఐ స్వస్తి..

Team India

Team India

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టి20, వన్డే సిరీస్‌లలో ఎదురైన ఓటముల అనంతరం భారత క్రికెట్ నియంత్రణ మం‌డలి (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డోస్చేట్, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ కాంట్రాక్టులను పునరుద్ధరించకూడదని నిర్ణయించింది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ధృవీకరించారు. యునైటెడ్ కింగ్‌డమ్ (UK) పర్యటన ముగిసే వరకు వీరిని కొనసాగించినప్పటికీ, ఒప్పందం ముగియడంతో ఇకపై ఎలాంటి పొడిగింపు ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. టెన్ డోస్చేట్ రెండేళ్ల కాంట్రాక్ట్ జూన్ 10తో, టి. దిలీప్ కాంట్రాక్ట్ జూన్ 8తో పూర్తయ్యాయి.

పదవీకాలాన్ని పొడిగించకపోవడానికి కారణాలు..
రయాన్ టెన్ డోస్చేట్: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచన మేరకు జట్టులోకి వచ్చిన డోస్చేట్‌కు మొదట ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు ఇస్తామని చెప్పారు. కానీ, గత రెండేళ్లలో ఆయనకు స్పష్టమైన పాత్ర ఏదీ కేటాయించకపోవడంతో ఆయన కూడా జట్టు నుంచి వైదొలగడానికే మొగ్గు చూపారు.

టి. దిలీప్: ఒక సీనియర్ స్టార్ ఆటగాడి కోరిక మేరకు దిలీప్‌కు గతంలో ఏడాది పాటు కాంట్రాక్ట్ పొడిగించినప్పటికీ, ఆయన పనితీరు పట్ల బిసిసిఐ సంతృప్తిగా లేదు. ఇటీవల ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ఫీల్డింగ్ పరంగా జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా ఎవరు రానున్నారు?
కొత్త ఫీల్డింగ్ కోచ్ ఎంపిక కోసం బిసిసిఐ ప్రస్తుతం 2 నుంచి 3 మంది అభ్యర్థులతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో రాహుల్ ద్రావిడ్ కాలం నుంచి పనిచేస్తున్న అస్సాంకు చెందిన శుభదీప్ ఘోష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. త్వరలోనే బిసిసిఐ కొత్త కోచింగ్ సిబ్బందిని అధికారికంగా ప్రకటించనుంది.