BCCI: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు నుంచి బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ను తొలగించాలని చేయాలని బీసీసీఐ అధికారికంగా కోరింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. కొంతకాలంగా పెరుగుతున్న ప్రజా, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మొదట బీసీసీఐ వేచి చూసింది. ఇటీవలి పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సైకియా చెప్పారు. ఇది బంగ్లాదేశ్లో క్షీణిస్తున్న దౌత్య పరిస్థితులు, అక్కడ జరుగుతున్న పౌర అశాంతి, అలాగే భారత్లో చోటు చేసుకుంటున్న నిరసనలపై పరోక్ష సూచనగా భావిస్తున్నారు.
మరోవైపు.. డిసెంబర్లో జరిగిన వేలంలో కేకేఆర్ ముస్తాఫిజుర్ను రికార్డు స్థాయిలో రూ.9.20 కోట్లకు కొనుగోలు చేయడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బంగ్లాదేశ్ ఆటగాడిగా అతను నిలిచాడు. ముస్తాఫిజుర్ కేకేఆర్కు వ్యూహాత్మకంగానూ, ఆర్థికంగానూ పెద్ద ఎదురుదెబ్బగా మారాడు. రూ.9.20 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి ముస్తాఫిజుర్ను తీసుకోవడం నిరాశను మిగిల్చింది.. ప్రపంచ స్థాయి మైదానాల్లో మంచి బౌలింగ్ సామర్థ్యం కలిగిన ఈ బౌలర్ను జట్టుకు పెద్ద బలంగా కేకేఆర్ భావించింది. ఓ వైపు సీజన్ దగ్గరపడుతుండటం.. మరోవైపు.. ఈ బౌలర్ను కోల్పోవడంతో బౌలింగ్ విభాగంలో పెద్ద లోటు ఏర్పడింది. దీంతో చివరి ఓవర్ల భారం పూర్తిగా మతీష పతిరానాపై పడే అవకాశం ఉంది.