AP Rain Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన!

Ap Rains Prediction 2026

Ap Rains Prediction 2026

AP Weather Forecast Today: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ వాయుగుండం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌లోని సత్ఖీరాకు సుమారు 80 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని బంకురాకు 160 కిలోమీటర్లు, ఒడిశాలోని బాలేశ్వర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా కదులుతూ గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా జార్ఖండ్ వైపు పయనించే అవకాశం ఉందని అంచనా వేశారు.

వాయుగుండం ప్రభావంతో వాయువ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో మంగళవారం వరకు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సముద్రం అలజడిగా మారి అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే సురక్షితంగా తీరానికి తిరిగి రావాలని సూచించింది. సముద్రంలో పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో అధికారుల సూచనలు పాటించాలని కోరింది.

వాయుగుండం ప్రభావంతో సోమవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖపట్నం, ఏలూరు జిల్లాలకు వర్ష సూచన జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. వాయుగుండం కదలిక, దాని ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకునే మార్పులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.