Mahadevpappa Death: కార్యకర్తలు ధైర్యంగా ఉండండి.. బీజేపీ నాయకత్వం మీకు అండగా ఉంది: బండి సంజయ్

  • గిరిజన బిడ్డ ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య
  • ఆత్మహత్యపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
  • కార్యకర్తలకు బీజేపీ అండగా ఉంది
Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, గిరిజన బిడ్డ ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకొవడం తీవ్ర కలకలంగా మారింది. మాఫియా రాజకీయాలు, అహంకార ధోరణి తట్టుకోలేకే మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు స్పందించారు. మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని, మహదేవప్ప కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Also Read: Goshamahal Cash Seized: మూడు సంచుల్లో నగదు.. గోషామహల్‌లో భారీగా డబ్బు పట్టివేత!

మహదేవప్పది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ చేసిన హత్య అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ‘ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోంది. మా సహనాన్ని పిరికితనంగా భావిస్తారా?. ఎన్నికల తరువాత కాంగ్రెస్‌పై యుద్దం చేయబోతున్నాం. బీఆర్ఎస్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్తాపితం చేసే రోజులొచ్చాయి. బీజేపీ కార్యకర్తలారా.. ధైర్యంగా ఉండండి, నాయకత్వం మీకు అండగా ఉంది. మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు బయలుదేరారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలి. నిష్పాక్షికంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షాంచాలి’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.