Balapur Ganesh 2026: రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ బాలాపూర్ గణేశుడి వద్ద వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ సందర్భంగా బాలాపూర్లో సాయంత్రం 6 గంటలకు బాలాపూర్ గణనాథుడి తొలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి నిర్వాహకులు వెల్లడించారు. ఉదయం నుంచే నగర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. ఈ ఏడాది బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయ నమూనా సెట్టింగ్ ప్రధాన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయాన్ని తలపించేలా నిర్మించిన ఈ భారీ సెట్టింగ్ను ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ నిర్మాణ వైభవం, విద్యుత్ వెలుగులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వాలంటీర్లను అందుబాటులో ఉంచడంతో పాటు, పోలీసు, ఇతర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ఉత్సవ సమితి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది.
మరోవైపు, ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేశ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. “తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఖైరతాబాద్ మహా గణపతిను కోరుకున్నాను. బడా గణపతిది 72 ఏళ్ల ప్రస్థానం. గవర్నర్ తొలి పూజ నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేశాం. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశాం. గత మూడేళ్లుగా మండపాలకు ఉచిత కరెంట్ అందిస్తున్నాం. ఉత్సవాలు సక్రమంగా సాగాలంటే భక్తుల సహకారం కూడా ఎంతో అవసరం. ఆషాడ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాం. ఇప్పుడు గణపతిని కూడా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని గణపతికి ప్రత్యేక పూజలు చేశాం. ఇప్పుడున్న విపత్తును ఎదుర్కొని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలనీ కోరుకున్నాను.” అని మంత్రి స్పష్ట చేశారు.

