NTV Telugu Site icon

Tirupati Crime: ఫేస్‌బుక్‌లో ప్రేమించుకున్నారు.. పెళ్లితో ఒక్కటయ్యారు.. ఆస్తి చిచ్చు పెట్టింది..!

Attack

Attack

Tirupati Crime: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేమ వ్యవహారాలు ఎక్కువయ్యాయి.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, షేర్‌చాట్‌, వాట్సాప్.. ఇలా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పరిచయం అయిన వాళ్లు.. కాస్త ప్రేమ వైపు అడుగులు వేస్తున్నారు.. కొందరు పెద్దలను ఒప్పించి తమ ప్రేమను పెళ్లిపీటలకు ఎక్కిస్తే.. మరికొందరు పెద్దలు అంగీకరించకపోవడంతో.. ఇంటి నుంచి పారిపోయి పెళ్లితో ఒక్కటవుతున్నారు.. అయితే, ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులను తట్టుకొని నిలబడేవారు కొందరతై.. తమవళ్లకాదు బాబోయ్‌ అంటూ పారిపోయేవారు లేకపోలేదు.. తాజాగా, ఏపీలో ఓ ప్రేమ జంటకు వింత అనుభవం ఎదురైంది.. ఫేస్‌బుక్‌లో పరిచయంతో పెళ్లిచేసుకున్న ఆ జంట విపత్కర పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది.

Read Also: Cab Drivers Protest: క్యాబ్‌ డ్రైవర్ల నిరసన.. ఆరూట్‌కు రాలేమంటూ రైడ్‌ క్యాన్సిల్..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం సీఎన్‌పేట గ్రామానికి చెందిన యనమల హరిబాబుకు సోషల్‌ మీడియా (ఫేస్‌బుక్‌)లో నంద్యాల జిల్లా పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన సుకన్యతో పరిచయం ఏర్పడింది.. వారి వ్యవహారం ఫేస్‌బుక్‌ నుంచి వాట్సాప్‌ వరకు వెళ్లింది.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన ఆ జంట.. 2 నెలల కిందట పెళ్లితో ఒక్కటయ్యింది.. దాదాపు నెల రోజుల పాటు అక్క ఇంట్లో తలదాచుకున్న ఆ జంట.. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నారు.. అదే ఇప్పుడు ఆ జంటతో పాటు.. యువకుడి కుటుంబానికి కష్టాలు తెచ్చిపెట్టింది. హరిబాబు ఇంటికి వచ్చిన సుకన్య కుటుంబ సభ్యులు.. హరిబాబుకు సంబంధించిన ఆస్తి పాస్తులు అన్నీ యువతి పేరుపైకి మార్చాలంటూ పట్టుబట్టారు. అయితే, హరిబాబుకు సోదరుడు కూడా ఉండడంతో.. ఆస్తిపాస్తులు రాసివ్వడం ఇప్పడే కుదరదని స్పష్టం చేశారు.. ఇక, దీంతో రెచ్చిపోయిన యువతి బంధువులు.. రాడ్లు, కర్రలతో హరిబాబు కుటుంబంపై దాడి చేశారు. అతడి తల్లి కొట్టడమే కాకుండా ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.. అడ్డుకునేందుకు యత్నించిన హరిబాబుపై విచక్షణారహితంగా దాడి చేశారు.. ఇది గమనిస్తూ చాలా సేపు మనకు ఎందుకులే అనుకున్న స్థానికులు.. ఆ తర్వాత దాడి చేస్తున్నవారిపై తిరగబడ్డారు. దీంతో.. సుకన్య బంధువులు పరారయ్యాడు.. ఇక, తీవ్రంగా గాయపడిన హరిబాబు కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలించారు.. స్థానికుల సమచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా.. ఫేస్‌బుక్‌లో పరిచయమై.. పెళ్లి చేసుకున్న ఆ కాపురంలో ఇప్పుడు ఆస్తిపాస్తులు చిచ్చుపెట్టాయి.