PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్‌పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..

Vajpayee Biopic

Vajpayee Biopic

Vajpayee Death Anniversary: భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన అజాతశత్రువు, భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. “ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.. పార్టీలు ఏర్పడుతుంటాయి, అంతరించిపోతుంటాయి.. కానీ ఈ దేశం, ఈ దేశ ప్రజాస్వామ్యం ఎల్లప్పుడూ శాశ్వతంగా వర్ధిల్లాలి” అంటూ నాడు వాజ్‌పేయీ పార్లమెంట్‌లో చేసిన చారిత్రాత్మక ప్రసంగం నేటికీ ప్రతీ భారతీయుడి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న అపరిమితమైన నిబద్ధతకు, విశాల దృక్పథానికి ఈ మాటలే సజీవ సాక్ష్యం.

వాజ్‌పేయీ 8వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి స్థల్ ‘సదైవ్ అటల్’ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్ సహా పలువురు ప్రముఖ నేతలు నేరుగా వెళ్లి పుష్పాంజలి ఘటించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ వంటి దిగ్గజ నాయకులు సామాజిక మాధ్యమం ‘X’ వేదికగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఆత్మీయ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పందిస్తూ, వాజ్‌పేయీని ఒక అసాధారణమైన రాజనీతిజ్ఞుడిగా అభివర్ణించారు. ఆయన తన జీవితాంతం దేశ సేవకే అంకితం చేశారని, ఆయన ఆలోచనలు, ఆశయాలు రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని కొనియాడారు. వాజ్‌పేయీ సమర్థవంతమైన నాయకత్వమే భారతదేశాన్ని మరింత బలీయంగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు. ఇక పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ యుద్దంలో విజయం ద్వారా వాజ్‌పేయీ ప్రపంచ వేదికపై భారత సమర్థతను, తిరుగులేని శక్తిని చాటిచెప్పారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తుచేశారు. విలువలతో కూడిన ఆయన రాజకీయ ప్రస్థానం వల్ల అంత్యోదయ, సుపరిపాలన అనే ఆశయాలు క్షేత్రస్థాయిలో నిజరూపం దాల్చాయని పేర్కొన్నారు.

వాజ్‌పేయీ తన పరిపాలనా కాలంలో తీసుకున్న అనేక దూరదృష్టితో కూడిన నిర్ణయాలు దేశ రూపురేఖలనే మార్చివేశాయి. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించి భారత్‌ను అగ్రరాజ్యాల సరసన అణుశక్తి దేశంగా నిలబెట్టడం ఆయన సాహసానికి నిదర్శనం. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలను అనుసంధానించే ప్రతిష్టాత్మక ‘స్వర్ణ చతుర్భుజి’ (గోల్డెన్ క్వాడ్రిలేటరల్) హైవే ప్రాజెక్ట్‌కు ఆయనే శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం పక్కా రహదారి సౌకర్యాన్ని కల్పిస్తూ ఆయన తీసుకొచ్చిన ‘ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన’ దేశ ప్రగతిలో మైలురాయిగా నిలిచింది. వీటితో పాటు టెలికాం, విద్యా రంగాల్లో ఆయన చేపట్టిన సంస్కరణలు భారతదేశాన్ని ఆధునిక బాటలో ముందుకు నడిపించాయి. దేశ సంక్షేమానికి, విలువల రాజకీయాలకు అటల్ బిహారీ వాజ్‌పేయీ అందించిన సేవలు తరతరాలకూ మార్గదర్శకంగా నిలిచిపోతాయి.