Asim Munir: పాకిస్థాన్ సైనిక అధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఉన్నఫలంగా దేశంలోని అతిపెద్ద ఆయుధ కర్మాగారమైన ‘పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్’ (POF)ని సందర్శించడం దక్షిణాసియా ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పర్యటన కేవలం ఒక సాధారణ తనిఖీకి పరిమితం కాకుండా, పాకిస్థాన్ తన సైనిక వ్యూహాలను ఏ విధంగా మార్చుకుంటోందో స్పష్టంచేస్తోంది. అక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన నూతన ఆయుధాలు, మందుగుండు సామగ్రి పరీక్షలను స్వయంగా పరిశీలించిన మునీర్, ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్న రెండు కొత్త పారిశ్రామిక ప్లాంట్లను కూడా వీక్షించారు. విదేశీ ఆయుధ దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, స్వయంసమృద్ధి సాధించడమే కాకుండా, ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేస్తూ విదేశాలకు ఆయుధాలను ఎగుమతి చేయాలనే వ్యూహాన్ని పాకిస్థాన్ సిద్ధం చేసుకుంటోంది.
ఈ సైనిక సమాయత్తం వెనుక బలమైన అంతర్జాతీయ కూటముల హస్తం కూడా కనిపిస్తోంది. ఇటీవల సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్థాన్ల మధ్య ఒక ఉమ్మడి రక్షణ ఒప్పందం కుదిరింది. ఒకరిపై దాడి జరిగితే ముగ్గురిపై దాడి జరిగినట్లేననే ముఖ్యాంశంతో రూపొందిన ఈ ఒప్పందాన్ని కేవలం ఆత్మరక్షణ కోసమేనని పాకిస్థాన్ చెబుతున్నప్పటికీ, దీని వెనుక పెద్ద వ్యూహమే ఉంది. సౌదీ అరేబియా ఆర్థిక బలం, తుర్కియే ఆయుధ సాంకేతికత, పాకిస్థాన్ సైనిక, అణు సామర్థ్యాలు కలిసి ఒక కొత్త ఆసియా శక్తి కూటమిగా రూపకల్పన చెందుతున్నాయి. దీనికి తోడు దశాబ్దాలుగా ఉన్న చైనా రక్షణ భాగస్వామ్యం కూడా కలిస్తే, చైనా-తుర్కియే-సౌదీ-పాకిస్థాన్ ల మధ్య ఒక అపారమైన రక్షణ నెట్వర్క్ ఏర్పడే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వ్యూహాత్మక అడుగులు భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారాయి. 2025 నాటి మిలిటరీ ఉద్రిక్తతల తర్వాత ఇరు దేశాల మధ్య విశ్వాస లేమి మరింత తీవ్రమైంది. 2026 ఆగస్టులో ‘ఆపరేషన్ సిందూర్’ ప్రకటనలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించడం, భారత మాజీ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యలు ‘కిరాణా హిల్స్’ అంశంపై కొత్త వివాదానికి తెరలేపడం వంటి కారణాలతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటువంటి క్లిష్ట సమయంలో పాకిస్థాన్ తన ఆయుధ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం, ప్రాంతీయ కూటములను ఏర్పరచుకోవడం చూస్తుంటే, ఆ దేశం తన సైనిక యంత్రాంగాన్ని ఏ రకమైన భవిష్యత్ ఘర్షణల కోసం సిద్ధం చేస్తోందోననే అనుమానాలు బలపడుతున్నాయి.

