Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!

Ashok Dinda

Ashok Dinda

Ashok Dinda: మాజీ భారత క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అశోక్ డిండా (Ashok Dinda) రాజకీయాల్లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ మంత్రివర్గంలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అశోక్ డిండా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో మొత్తం 35 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ డిండా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మోయ్నా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చందన్ మండల్‌పై 16,241 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండోసారి విజయం సాధించారు. 2021 ఎన్నికల్లో కూడా ఆయన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సంగ్రామ్ డోలూయిపై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.

×
×
Ad

క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అశోక్ డిండా.. 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అడుగుపెట్టారు. భారత తరఫున 13 వన్డేలు, 9 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆయన వన్డేల్లో 12 వికెట్లు, టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టారు. దేశీయ క్రికెట్‌లో బెంగాల్ జట్టుకు కీలక ఆటగాడిగా సేవలందించిన డిండా, ఐపీఎల్‌లో కూడా పలు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పుణే వారియర్స్ ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్ల తరఫున ఆడారు. ఐపీఎల్‌లో మొత్తం 78 మ్యాచ్‌లు ఆడి 69 వికెట్లు సాధించారు.

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత 2021 ఫిబ్రవరిలో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన అశోక్ డిండా.. తక్కువ కాలంలోనే రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు మంత్రి పదవి దక్కించుకోవడంతో క్రికెట్ మైదానంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్దమయ్యాడు.