సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో పోలింగ్ కు సంబంధించి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే.. ఎన్నికల సంఘం ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇప్పటికే పలుమార్లు సూచించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఓటేసేందుకు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు.. తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలు కాబట్టి.. ఓటు వేయడం కోసమని తమ ఊర్లకు ప్రయాణమవుతున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగా.. పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈనెల 13వ తేదీన (సోమవారం) ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అందుకోసం తమ గ్రామాలకు వెళ్లడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. ఏపీకి వెళ్లేందుకు జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులలో వెళ్దామని అనుకునే జనాలకు.. ప్రైవేట్ బస్సుల్లో ధరలు పెంచుతున్నారు. ఇటు.. రైళ్లలో వెళ్లేందుకు చూస్తుండగా జనాలు కిక్కిరిసిపోతున్నారు. ఈ క్రమంలో.. జనాలు ఇబ్బందులు పడుతున్నారు.
Ponnam Prabhakar : నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది
కాగా.. ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుంచి 626 ప్రత్యేక సర్వీసులు అందిస్తుంది. అంతేకాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా బెంగళూరు నుంచి 200 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల నుంచి రెగ్యులర్ సర్వీసులు ఫుల్ కాకపోవడంతో ప్రత్యేక సర్వీసులు లేవు. మరోవైపు.. 10వ తేదీ శుక్రవారం కావడం.. అలాగే శని, ఆది వారాలు సెలవులు ఉండటంతో అత్యధికంగా 199 సర్వీసులు హైదరాబాద్ నుంచి, 95 సర్వీసులు బెంగళూరు నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తుంది ఏపీఎస్ ఆర్టీసీ.