ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న బలమైన ఉపరితల ఆవర్తనం, దాని అనుబంధ ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ తీవ్ర ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, బాపట్లతో పాటు మార్కాపురం పరిసర ప్రాంతాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాయలసీమ పరిధిలోని పలు జిల్లాల్లో సైతం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, ఇవాళ , రేపు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీరం వెంబడి గాలి వేగం చాలా తీవ్రంగా ఉంటుందని, ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. రైతులు, పశువుల కాపరులు వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందవద్దని, సురక్షితమైన భవనాల్లోనే ఉండాలని అధికారులు కోరారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే సహాయం కోసం స్థానిక కంట్రోల్ రూమ్ నెంబర్లను సంప్రదించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

