ఆంధ్రప్రదేశ్లో రాగల కొన్ని గంటల్లో పలు ప్రాంతాల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా రానున్న మూడు గంటల వ్యవధిలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తీరప్రాంతం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు వెల్లడించారు.
రైతులు, వ్యవసాయ కార్మికులు, పశువుల కాపరులు వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా ఓపెన్ గ్రౌండ్స్ లో నిలబడవద్దని సూచించారు. వర్ష సూచన ఉన్నందున సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు తగిన అప్రమత్తత వహించాలి. ఉరుములు, మెరుపులు తీవ్రంగా ఉన్న సమయంలో ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను డిస్కనెక్ట్ చేయడం శ్రేయస్కరం. పొలాల్లో పనిచేసే కూలీలు పిడుగులు పడే ముప్పును గుర్తించి సురక్షితమైన కాంక్రీట్ భవనాలు లేదా సురక్షిత నివాసాలలో ఆశ్రయం పొందాలని విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను కోరింది.
స్థానిక యంత్రాంగం , ఆయా జిల్లాల అధికారులు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నిరంతరం వాతావరణ మార్పులను గమనిస్తూ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసే ప్రకటనలకు అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్త పడాలని తెలిపారు.

