Southwest Monsoon Active Over AP: ఆంధ్రప్రదేశ్ మీదుగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాలు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు విస్తరించాయని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో నేడు (జూన్ 12) భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోస్తాంధ్ర వ్యాప్తంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా రహదారులపై నీరు నిలిచిపోవడం, చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు తక్షణమే తీరానికి చేరుకోవాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

