బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారంకు తుపానుగా బలపడనుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఈడీ దీపక్, అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. అల్పపీడనం నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సోమవారంకు తుపానుగా బలపడుతుందని ఎండీ ప్రఖర్ జైన్ చెప్పారు. రాష్ట్రానికి రేపు భారీ, ఎల్లుండి అతిభారీ, సోమ-మంగళ వారాల్లో అత్యంత భారీ వర్ష సూచన ఉందని తెలిపారు. తుపాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలని అలెర్ట్ చేయాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
‘ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు, ప్రజలకు తెలియజేయాలి. సహయక చర్యలకు SDRF, NDRF బృందాలు పంపించండి. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మరింత అలెర్ట్ గా ఉండాలి. కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి 24/7 కొనసాగించాలి. శిథిలావస్థలో ఉన్న ఇళ్ళల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కడిక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి మంచి ఆహారం అందించాలి. విరిగిన చెట్లు తొలగించడం, విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా ఉండాలి’ అని అధికారులతో హోంమంత్రి అనిత చెప్పారు.
Also Read: Sexual Harassment: లైంగిక వేధింపుల కేసు.. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్!
‘సోషల్ మీడియాలోని వదంతులు నమ్మవద్దు. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రందించాలి. బలమైన ఈదురుగాలుల వీచేప్పుడు చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండకండి. భారీ వర్షాలు కురుస్తున్నపుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి’ అని హోంమంత్రి అనిత సూచనలు చేశారు.