ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా ప్రభుత్వం భారీ అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం జరిగిన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం చారిత్రాత్మక నిర్ణయాలకు వేదికైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలలో సుమారు రూ.2,01,023 కోట్ల విలువైన 25 భారీ ప్రాజెక్టులకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 39,067 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాలకు భారీ కేటాయింపులు జరగడం గమనార్హం.
రిలయన్స్ మెగా ఇన్వెస్ట్మెంట్..
ఈ సమావేశంలో అత్యంత కీలకమైన అంశం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతిపాదన. విశాఖపట్నంలో ఏకంగా రూ.1,08,010 కోట్లతో భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ముందుకు రాగా, దానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఇది ఐటీ రంగంలో ఏపీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. దీనితో పాటు, శ్రీసత్యసాయి జిల్లాలో రూ.51,300 కోట్లతో సోలార్ పవర్ ప్రాజెక్టును కూడా రిలయన్స్ నెలకొల్పనుంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి దొరకనుంది.
జిల్లాల వారీగా ప్రధాన ప్రాజెక్టులు..
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమపాళ్లలో పెట్టుబడులు అందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కడప జిల్లాలో.. అదానీ హైడ్రో ఎనర్జీ ఆధ్వర్యంలో రూ.12,297 కోట్లతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. తిరుపతి జిల్లాలో.,.., ప్రసిద్ధ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ‘రాయల్ ఎన్ఫీల్డ్’ రూ.2,508 కోట్లతో తన పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయనుంది. దీనివల్ల 3,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే అపోలో టైర్స్ రూ.6,100 కోట్లు, క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ రూ.863 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.
హైడ్రోజన్, సీబీజీ (CBG) ప్లాంట్లు, బయో ఫ్యూయల్స్ రంగంలో యమాన్కో ఇండియా, ఐఓసీ జీపీఎస్ వంటి సంస్థలు వేల కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. పలనాడులో చెట్టినాడ్ సిమెంట్స్ (రూ.1,340 కోట్లు), నెల్లూరులో ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ (రూ.3,153 కోట్లు) తమ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు. కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా, అవి క్షేత్రస్థాయిలో పెట్టుబడులుగా మారాలని స్పష్టం చేశారు. “అనుమతుల జారీ నుంచి శంకుస్థాపన వరకు, శంకుస్థాపన నుంచి ఉత్పత్తి ప్రారంభం వరకు ప్రతి దశలోనూ నిర్దేశిత గడువు పాటించాలి. అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక ‘బ్రాండ్’గా నిలవాలి” అని ఆయన పేర్కొన్నారు. ఒక్క రోజు కూడా అనవసర జాప్యం జరగకూడదని, పోటీ ప్రపంచంలో ఇతర రాష్ట్రాల కంటే మనం మెరుగ్గా ఉన్నామని నిరూపించుకోవాలని అధికారులను ఆదేశించారు.
భారీ పరిశ్రమలతో పాటు మధ్యతరహా, చిన్న తరహా పరిశ్రమలకు (MSME) కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యుర్’ లక్ష్యం నెరవేరాలంటే ఎంఎస్ఎంఈలు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పండుతున్న ఉద్యానవన పంటలైన ఆయిల్ పామ్, మామిడి, కొబ్బరి వంటి వాటికి ‘వ్యాల్యూ అడిషన్’ ఇచ్చేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని, తద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. మొత్తానికి.. 17వ ఎస్ఐపీబీ సమావేశం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి కొత్త ఊపిరి పోసింది. పారదర్శకమైన విధానాలు, వేగవంతమైన అనుమతులతో రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చే దిశగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమావేశంలో మంత్రులు టీజీ భరత్, అచ్చెన్నాయుడు, సీఎస్ సాయిప్రసాద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
