ఆంధ్రప్రదేశ్లో కొందరు కీలక మంత్రులకు అజ్ఞాత వ్యక్తుల నుంచి హెచ్చరికలతో కూడిన లేఖలు రావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. జాగ్రత్తగా ఉండాలంటూ పంపిన ఈ లేఖలపై భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే మంత్రి కందుల దుర్గేష్ పీఎస్.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్లకు కూడా ఇదే తరహా హెచ్చరిక లేఖలు అందాయి.
ఒకే విధమైన సందేశంతో పలువురు మంత్రులకు లేఖలు రావడం వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లేఖపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ లేఖల వ్యవహారం అసెంబ్లీ లాబీల్లో విస్తృత చర్చకు దారి తీసింది. హెచ్చరిక లేఖల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
Also Read: AP Assembly 2026: అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే ఉద్రిక్తత!
కందుల దుర్గేష్ మాట్లాడుతూ… ‘మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ చూసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. నాకు చాలా మంది ఫోన్లు చేశారు. నేను పనిచేసేది టూరిజం లాంటి చిన్న శాఖ. దీంట్లో మావోయిస్టులు లేక రాయాల్సినంత పెద్ద హడావిడి ఏముంటుంది. వ్యక్తిగతంగా, శాఖ పరంగా ఎక్కడ ఎలాంటి తప్పులు ఉండవు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ లేఖలు రాసి ఉంటారు. మావోయిస్టులు లేఖలు ఇలా ఉండవు కదా?’ అని అన్నారు.
