OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?

  • గత ఎన్నికల్లో నెల్లిమర్ల టికెట్‌ ఆశించిన కర్రోతు బంగార్రాజు..
  • మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పదవితో సంతృప్తి పరిచిన పార్టీ పెద్దలు..
  • బంగార్రాజులో ఉనికి చాటుకోవాలనే తాపత్రయం తగ్గలేదా..?..
  • అభివృద్ధి అంశాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలే ఎక్కువ
Nelli Marla

Nelli Marla

ఆయనది అధికార పార్టీ. పైగా ఓ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఉన్నారు. అలాంటి వ్యక్తి సొంత పార్టీనే ఇరుకునపెట్టేలా వ్యవహరించారు. ఆయన వ్యవహారం ఇప్పుడు అక్కడ హాట్‌ టాపిక్‌ అయిందట. ఇలా ఆయన చేయడం మొదటిసారేం కాదు… ఇటీవల తరచూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు… అధికార పార్టీలో చర్చకు దారి తీస్తున్నాయట. తాజాగా సొంత పార్టీకి చెందిన కేంద్రమంత్రినే బహిరంగంగా నిలదీసి వార్తల్లోకెక్కారాయన. ఇలా చేయడం నిజంగానే ప్రజా సమస్యలపై పోరాటమా..? లేదంటే సొంత మైలేజ్ కోసమా..? అనే చర్చ అన్ని పార్టీల్లోనూ జరుగుతోందట. ఇంతకీ అధికార పార్టీలోనే అసంతృప్తిగా పనిచేస్తున్న ఆయన ఎవరు..? ఏంటాయన కథ.

కర్రోతు బంగార్రాజు. ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌. విజయనగరం జిల్లా భోగాపురం మండల ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కర్రోతు బంగార్రాజు… ఇప్పుడు మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. గత ఎన్నికల పమయంలో నెల్లిమర్ల టికెట్‌పై ఆశలు పెట్టుకున్నప్పటికీ… రాజకీయ సమీకరణాలు కలిసి రాలేదు. నియోజకవర్గ నాయకులను కూడగట్టి తన బలం చూపించే ప్రయత్నం చేశారట కూడా. చివరకు ఎమ్మెల్సీ హామీతో పరిస్థితి చల్లారగా… అనంతరం మార్క్‌ఫెడ్ ఛైర్మన్ పదవితో పెద్దలు సంతృప్తి పరచారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పదవి వచ్చిన తర్వాత కూడా… ఉనికి చాటుకోవాలనే తాపత్రయం మాత్రం తగ్గలేదన్న చర్చ నడుస్తోంది. ఉన్న చోట ఉనికి చూపాలంటే… ఊరంతా వినిపించేలా మాట్లాడాలన్న ధోరణిలో ప్రతీ సమావేశాన్ని రాజకీయ వేదికగా మార్చుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మార్క్‌ఫెడ్ ఛైర్మన్ హోదాతో ప్రోటోకాల్ లభించడంతో… దాదాపు అన్ని అధికారిక సమావేశాలకు హాజరయ్యే అవకాశం దక్కింది. అయితే ఆ వేదికలను అభివృద్ధి అంశాల కంటే… వివాదాస్పద వ్యాఖ్యలకు వేదికగా మార్చుతున్నారట కర్రోతు బంగార్రాజు. ఏదో ఒక అంశాన్ని లేవనెత్తడం… బిగ్గరగా మాట్లాడడం… అందరి దృష్టిని ఆకర్షించేలా వ్యవహరించడం అలవాటైందని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రజా సమస్యలపై గళమెత్తడం రాజకీయ నాయకుడి బాధ్యతే. కానీ… కర్రోతు బంగార్రాజు వ్యవహారం మాత్రం వ్యక్తిగత ప్రచారానికే పరిమితమవుతోందని నెల్లిమర్లలో చర్చ జరుగుతోంది. అధికార పార్టీలో ఉంటూనే… సొంత ప్రభుత్వాన్నే ఇబ్బందుల్లో పడేసేలా వ్యవహరించడం… ఇప్పుడు క్యాడర్‌లో హాట్ టాపిక్‌గా మారిందట. ఇటీవల భోగాపురం విమానాశ్రయం పర్యటనలో కేంద్రమంత్రి సమక్షంలో స్థానికులకు ఉద్యోగాల అంశాన్ని లేవనెత్తిన తీరు పార్టీలోనే చర్చకు దారి తీసిందట. మీరు వెళ్లిపోతారు… సమాధానం చెప్పాల్సింది నేనే అంటూ కేంద్రమంత్రి ముందే మాట్లాడటం అక్కడున్న నాయకులను ఆశ్చర్యానికి గురి చేసిందట. ఇదొక్కటే కాదు.. డీఆర్సీ సమావేశంలో ఇన్‌చార్జ్ మంత్రి వంగలపూడి అనిత సమక్షంలోనే ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారులపై విమర్శలు గుప్పించి కాకరేపారు. అంతకుముందు నెల్లిమర్ల పంచాయతీ సమావేశంలో కూడా ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అధికారులపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే భోగాపురంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ పర్యటన సందర్భంగా కూడా కర్రోతు హడావుడి చర్చనీయాంశమైందట.

వాస్తవానికి కర్రోతు బంగార్రాజు పనులు చేయించుకోవడంలో చాకచక్యంగా వ్యవహరిస్తాడన్న పేరు స్థానికంగా ఉంది. ప్రజల ముందు మాత్రం అనవసర హడావుడితో పెద్ద నాయకుడి ఇమేజ్ సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారనే గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. మరి బంగార్రాజు వ్యవహారంపై టీడీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుంది..? ఆయన దూకుడును ప్రజా సమస్యలపై పోరాటంగా పరిగణిస్తుందా..? లేదంటే పార్టీకి ఇబ్బందిగా మారుతుందని భావించి మందలిస్తుందా..? అనేది వేచి చూడాలి.