ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి పీఏ పైలా దిలీప్ను చెన్నై ఎయిర్పోర్ట్లో సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. చెన్నై నుంచి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా.. దిలీప్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిలీప్ను ఈరోజు రాత్రికి విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. రాజ్ కసిరెడ్డి పీఏ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు సిట్ బృందాలు భావిస్తున్నాయి.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితో పాటు మరో కొందరిని ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే గత కొన్ని రోజులుగా పోలీసుల ఎదుట హాజరుకాకుండా.. రాజ్ కసిరెడ్డి పీఏ పైలా దిలీప్ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఫోన్ లొకేషన్ ద్వారా అతడి కదలికలపై సిట్ బృందం నిఘా పెట్టింది. ఈరోజు చెన్నై ఎయిర్పోర్టులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం దిలీప్ వద్ద ఉన్నట్లు సిట్ బృందం భావిస్తోంది.