Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్‌

Ap Junior Doctors Strike

Ap Junior Doctors Strike

Junior Doctors Strike: ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ డాక్టర్లు (జూడాలు) సమ్మె సైరన్ మోగించారు.. తమ స్టైఫండ్ పెంపుపై జూడాలు పట్టుబడుతున్నారు.. ఈనెల అంటే ఆగస్టు 15వ తేదీలోగా ప్రభుత్వం నిర్ణయం వెలువరించాలని, లేదంటే ఈ నెల 17వ తేదీ నుంచి సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు.. అయితే, ఈ నెల 15వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని నిర్ణయించారు.. మరోవైపు.. ఉదయం 9 గంటల‌ నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సమ్మెలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను సైతం నిలిపివేస్తున్నట్టు నిర్ణయించారు జూనియర్‌ డాక్టర్లు..

రెసిడెంట్ డాక్టర్లకు సంబంధించిన న్యాయబద్ధమైన, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని APJUDA కోరింది. ముఖ్యంగా స్టైఫండ్ పెంపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసింది. తమ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఇక, సమ్మె కాలంలో డీఆర్‌పీ (DRP), పెరిఫెరల్ పోస్టింగ్స్‌ను నిలిపివేస్తామని APJUDA వెల్లడించింది. అదే సమయంలో సాధారణ ఆరోగ్య సేవలకు మరింత అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసర వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. అయితే, ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిష్కరణ చేపట్టనున్నట్లు APJUDA ప్రకటించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం గడువు ముగిసేలోపు స్పందించాలని కోరింది.

అయితే ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు వస్తే గడువు ముగియకముందే ఎప్పుడైనా అర్థవంతమైన చర్చలకు సిద్ధంగా ఉన్నామని జూడాలు స్పష్టం చేశారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని APJUDA కోరింది. దీంతో, స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ప్రస్తుతం వైద్య వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 17 నుంచి జూడాల సమ్మె మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది.