Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!

Govt Employee Turns Chain S

Govt Employee Turns Chain S

Govt Employee Turns Chain Snatcher: శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ కేసులో కీలక మలుపు వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేష్ నాయక్ అనే వ్యక్తి షేర్ మార్కెట్‌లో భారీ నష్టాలు రావడంతో దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. కదిరి పట్టణంలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రెండు లక్షల రూపాయల విలువైన బంగారు చైన్, కత్తి, బైకును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 28న వీవర్స్ కాలనీలో నడుచుకుంటూ వెళుతున్న శాంతి అనే మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వచ్చి లాక్కెళ్లినట్టు విచారణలో తేలింది.

పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. స్నాచింగ్‌కు ముందు నిందితుడు ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానం వచ్చిన పోలీసులు రమేష్ నాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. ఇంకా రెండు రోజుల కిందట కదిరిలోని డిగ్రీ కాలేజీ సమీపంలో మరో మహిళపై కూడా ఇదే తరహా చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి సుమారు రూ.40 లక్షలు నష్టపోయిన రమేష్ నాయక్, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలకు లోనై ఈ దారికి వెళ్లినట్టు అధికారులు తెలిపారు.

ఈ విషయంపై శివనారాయణస్వామి మాట్లాడుతూ, నిందితుడు నెలకు లక్ష రూపాయల జీతం పొందుతున్నప్పటికీ, అప్పుల పాలై చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడినట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగి ఇలా నేరానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమై, ఇలాంటి నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు..