Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..

Apdscnaralokesh

Apdscnaralokesh

విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ, 2029 నాటికి ఏపీలో మరో మూడు డీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేస్తామని, తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియనివారే తమ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇప్పటివరకు 14 డీఎస్సీల ద్వారా 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే చేసిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 350కి పైగా పిటిషన్లు వేసి నియామకాలను అడ్డుకోవాలని చూసినప్పటికీ, అన్నింటినీ దాటుకుని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. టెక్నాలజీ, ఐటీ, ఏఐ విప్లవం ఎంత పెరిగినా ఉపాధ్యాయుల స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సున్నితంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు దిశానిర్దేశం చేయాలని కోరారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగానే నూతన విద్యా విధానం ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ వేడుకల సందర్భంగా సీఎం చంద్రబాబు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు తీపి కబురు అందిస్తూ 12వ పీఆర్సీ (PRC) నియామకానికి ఆమోదం తెలిపారు. వచ్చే అక్టోబరు నుంచి రెండు డీఏలను మంజూరు చేయడంతో పాటు, 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్‌లను సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. వీటితో పాటు పోలీసులకు దసరా కానుకగా అదనపు సరెండర్ లీవ్, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్‌ను 10 నుంచి 15 శాతానికి పెంపు, ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ నిధులను ప్రతినెలా జమ చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేయడంతో సభలో ఉన్న ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.