AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..

Ap Govt Employees

Ap Govt Employees

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతో అమరావతిలో జరిగిన సమావేశంలో చర్చలు సానుకూలంగా ముగిశాయి. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సాధ్యమైనంత సాయంగా నిలుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా పలు కీలక ప్రకటనలు చేయగా, ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ సీఎం నిర్ణయాలపై తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగుల కోసం 12వ పీఆర్సీ (PRC) నియామకానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 1-7-2024, 1-1-2025 కి సంబంధించిన రెండు డీఏలను (DA) 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, కాబట్టి ఈ డీఏలు అక్టోబర్ నెల జీతాల నుంచి ఉద్యోగులకు అందుతాయి.

లీవుల చెల్లింపులకు సంబంధించి, 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్స్ బకాయిలను వచ్చే సంక్రాంతి నుంచి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ఆమోదం తెలిపారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఈ దసరాకే ఒక అడిషనల్ సరెండర్ లీవ్ చెల్లించాలని నిర్ణయించారు.

పింఛనుదారులకు ఊరటనిస్తూ అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ రిస్టోరేషన్ కు ప్రభుత్వం అంగీకరించింది. దీనిని జనవరి 2027 నుంచి అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా 70 ఏళ్లు దాటిన పింఛనుదారులకు 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది.

ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను (EHS) పూర్తిగా స్ట్రీమ్‌లైన్ చేయనున్నారు. వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల నిధులను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ కీలక నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ.2,880 కోట్ల అదనపు భారం పడనుంది.