CM YS Jagan: నా మనస్సు ఎప్పుడూ మీకు మంచి చేయాలనే ఆలోచన చేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ రోజు సీఎం జగన్ను కలిశారు ఏపీ జేఏసీ అమరావతితో సహా పలు ఉద్యోగ సంఘాల నేతలు.. కేబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు కొత్తగా జీపీఎస్ తీసుకురావడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ ఏర్పాటు సహా ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగ సంఘాల నేతలు.. ఇక, ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా 60 రోజుల్లోగా పూర్తిగా అమల్లోకి రావాలని స్పష్టం చేశారు.. ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్న ఆయన.. డైలీవేజ్ కేటగిరీ ఉద్యోగులను కూడా ఆప్కాస్ పరిధిలోకి తీసుకుని రావాలి.. మీరు సంతోషంగా ఉంటే డెలివరీ మెకానిజం బాగుంటుంది.. ప్రజలు సంతోషంగా ఉంటారని తెలిపారు.
నా తరపున నుంచి మిమ్నల్ని సంతోషంగా ఉంచడానికి ప్రతి కార్యక్రమం కూడా మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో చేస్తున్నాం అని తెలిపారు సీఎం జగన్.. ఈ విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి.. ఎవరైనా రాజకీయ కారణాలతో ఏదైనా చెప్పినా మీరు వాటిని విశ్వసించనక్కర లేదన్నారు.. నా మనసు ఎప్పుడూ మీకు మంచి చేయడం కోసమే ఉంటుంది. అన్నింటినీ పరిష్కరిస్తున్నాం. తొలిసారి ప్రభుత్వం సమస్యలను సమస్యలుగా వదిలేయకుండా.. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం చూపాలని ప్రయత్నిస్తున్నాం.. దానివల్ల మీకూ మంచి జరగాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి జరగాలని ఆలోచన చేశాం. జీపీఎస్ కోసం దాదాపు రెండు సంవత్సరాలు కసరత్తు చేశాం. ఉభయ ప్రయోజకరంగా ఉండే విధంగా జీపీఎస్ను రూపొందించామని వివరించారు.
భవిష్యత్ తరంలో కూడా ఆ రోజు జగన్ ఉద్యోగులకు మంచి చేశాడు.. అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి చేశాడు అన్న మాట వినిపించాలని ఆకాక్షించారు సీఎం జగన్.. 2003లో ప్రభుత్వాలు ఇది అయ్యేపని కాదని చేతులు ఎత్తేశాయి. ఆ పరిస్థితి కూడా రాకూడదు, ఉద్యోగులు రోడ్డుమీదకు రాకూడనే ఉద్దేశ్యంతో ఎంతో ఆలోచన చేశాం. మీరు ఈ రోజు తీసుకుంటున్న జీతం బేసిక్లో కనీసం 50 శాతం పెన్షన్గా వచ్చేట్టు ఏర్పాటు చేశాం. ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని డీఆర్లు జీపీఎస్లో ఇస్తున్నాం. రిటైర్ అయిన ఉద్యోగుల జీవన ప్రమాణాలు స్ధిరంగా మెయింటైన్ కావడానికి తగినట్టుగా గ్యారంటీ పెన్షన్ స్కీంను తీసుకువచ్చాం. కంట్రిబ్యూషన్, పీఆర్సీ కాకుండా.. మిగిలినవి అన్నీ కూడా ఓపీఎస్ మాదిరిగానే ఉంటుందని స్పష్టం చేశారు.
1.35 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను నియమించాం.. వీళ్లందరూ భవిష్యత్తులో జగన్ నాకు మంచి చేశాడన్న మాట రావాలే తప్ప.. మరో మాట రాకూడదని, ఉద్యోగులకు మంచి జరగాలని చేశామన్నారు సీఎం జగన్.. ఇంత సిన్సియర్గా ఒక పరిష్కారం వెదికిన పరిస్ధితి రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదని దుయ్యబట్టారు.. భవిష్యత్లో జీపీఎస్ అనేది దేశానికే రోల్ మోడల్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఈ పథకం ఉద్యోగులకు మేలు చేస్తుంది. మీకు అన్ని రకాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నానన్న ఆయన.. ఈ ప్రభుత్వం మీది. మిమ్నల్ని పూర్తిగా భాగస్వామ్యులు చేసుకున్నాం.. మీ మొహంలో చిరునవ్వు ఉంటేనే మీరు బాగా చేయగలుగుతారు.. ప్రజలు సంతోషంగా ఉంటారని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.