CM YS Jagan Tour: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, శంకుస్ధాపనలు చేయనున్నారు. క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు.
ఇవాళ్టి షెడ్యూల్
కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. కడప ఎయిర్ పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో బద్వేలు నియోజకవర్గం గోపవరంకు సీఎం జగన్ చేరుకోనున్నారు. గోపవరంలో సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్పీఎల్ ప్లాంట్ల ప్రారంభోత్సవంలో పాల్గొని వాటి ప్రారంభించనున్నారు. సంస్థ ఉద్యోగులతో ఇంటరాక్షన్ కానున్నారు. కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బద్వేల్ నియోజకవర్గం గోపవరం దగ్గర 490 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసింది. పారిశ్రామిక పార్క్లో యాంకర్ యూనిట్గా సెంచురీ ప్యానల్స్ ఇండస్ట్రీ ఏర్పాటు జరిగింది. వంద ఎకరాల్లో 1,000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేశారు. 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి, మరిన్ని వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుంది. సరిగ్గా రెండేళ్ళ కిందట సెంచురీ ప్యానల్స్ పరిశ్రమను డిసెంబర్ 23, 2021న భూమి పూజ చేశారు సీఎం జగన్. కాసేపట్లో సెంచురీ పరిశ్రమ యూనిట్ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
అనంతరం హెలికాప్టర్ లో తిరిగి కడపకు సీఎం జగన్ చేరుకోనున్నారు. కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ వైఎస్సార్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంకు సీఎం జగన్ చేరుకోనున్నారు. స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లను ప్రారంభించనున్నారు. అనంతరం ఆధునికీకరించిన కలెక్టరేట్ భవనం, అంబేద్కర్ సర్కిల్, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ ప్రారంభించనున్నారు. మరికొన్ని అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేయనున్నారు. రాత్రికి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్లో బస చేయనున్నారు.
Read Also: Mukkoti Ekadasi: తిరుమలలో ముక్కోటి రద్దీ.. వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
సీఎం జగన్ రేపటి షెడ్యూల్
రేపు ఉదయం ఇడుపులపాయ గెస్ట్హౌస్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు సీఎం చేరుకోనున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తిరిగి ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్క్లో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రేపు రాత్రికి ఇడుపులపాయ గెస్ట్హౌస్లో బస చేయనున్నారు.