AP CM YS Jaganmohan Reddy: ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగాభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. పలు పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కార్యరూపం దాల్చనున్నాయి. క్యాంపుకార్యాలయం నుంచి 13 ప్రాజెక్టులకు వర్చువల్గా సీఎం జగన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో 3 కంపెనీలు ప్రారంభం కాగా.. 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఎంఓయూ ఖరారైంది. మొత్తంగా రాష్ట్రానికి రూ.3008 కోట్ల పెట్టుబడులు రాగా.. 7455 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా సుమారు 91వేలమంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు కాకాణి, గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, సీఎస్ జవహర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పరిశ్రమల రంగంలో మరో ఏడు ప్రాజెక్టుల పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడు ప్రాజెక్టుల ద్వారా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ 7 ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా రూ.2294 కోట్ల పెట్టుబడులు, 4300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరో ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఫుడ్ ప్రాసెసెంగ్ రూ. 714 కోట్ల పెట్టుబడి, 3,155 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
1. తిరుపతి సమీపంలోని నాయుడుపేట వద్ద గ్రీన్లామ్ సౌత్ లిమిటెడ్ను సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభించారు. రూ.800 కోట్ల పెట్టుబడితో రూ. 1050 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
2. అనంతపురం జిల్లా డి. హేరేహాల్ వద్ద రూ.544 కోట్లతో ఎకోస్టీల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన. దీనిద్వారా 500 మందికి ఉద్యోగాలు.
3. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్కు శంకుస్థాపన.రూ.125 కోట్ల పెట్టుబడి, 750 మందికి ఉద్యోగాలు.
4. సత్యసాయి జిల్లా మడకశిర వద్ద ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్. రూ.250 కోట్ల పెట్టుబడి, 600 మందికి ఉద్యోగాలు.
5. తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రావలి స్పిన్సర్ ప్రైవేట్ లిమిటెడ్కు శంకుస్థాపన. రూ.150 కోట్ల పెట్టుబడి, వేయిమందికి ఉద్యోగాలు.
6.బాపట్ల జిల్లా కొరసపాడు వద్ద శ్రావణి బయోఫ్లూయెల్స్ లిమిటెడ్కు శంకుస్థాపన. రూ.225 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు.
7. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద నాగార్జున ఆగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు శంకుస్థాపన.రూ.200 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు:
8.తిరుపతి జిల్లా కంచరపాలెం గ్రామం వద్ద డీపీ చాక్లెట్స్ కంపెనీని ప్రారంభించిన సీఎం. రూ.168 కోట్ల పెట్టుబడి, 250 మందికి ఉద్యోగాలు. కోకా మాస్, కోకా బటర్, కోకా పౌడర్ ఉత్పత్తి. ఏడాదికి 40 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, 18 వేలమంది రైతులకు ప్రయోజనం.
9. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది వద్ద ఓరిల్ ఫుడ్స్కు సీఎం శంకుస్థాపన. ఇన్స్టాంట్ చట్నీలు, పౌడర్లు తయారీ చేయనున్న కంపెనీ. రూ.50 కోట్ల పెట్టుబడి. 175 మందికి ఉద్యోగాలు, ఏడాదికి 7500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, వేయిమంది రైతులకు ఉపయోగం.
10. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడి వద్ద నేటివ్ అరకు కాఫీ కంపెనీకి సీఎం శంకుస్థాపన. రూ.20 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు.
ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. వేయిమంది రైతులకు ప్రయోజనం.
11.కడపజిల్లా పులివెందులలో అరటి ప్రాససింగ్ కోసం రూ.4 కోట్లతో స్ఫూర్తి క్లస్టర్కు సీఎం ప్రారంభోత్సవం. బనానా పౌడర్, స్టెమ్ జ్యూస్, హానీ డిప్ప్డ్ బనానా, కప్స్, ప్లేట్స్ తయారీ. రూ.700 మంది రైతులకు మేలు. 20 మందికి ఉద్యోగాలు.
12. రూ. 65 కోట్లతో 13 మిల్లెట్ ప్రాససింగ్ యూనిట్లు ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన. పాలకొండ, పార్వతీపురం, చింతపల్లి, భీమిలి, రాజానగరం, రంపచోడవరం, సూళ్లూరుపేట, పీలేరు, జమ్మలమడుగు, ఆదోని, నంద్యాల, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు. 260 మందికి ఉద్యోగాలు, ఏడాదికి 1800 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి.
20 వేలమంది రైతులకు ప్రయోజనకరం.
13. 3F పామాయిల్ కంపెనీ ఏర్పాటకు అవగాహన ఒప్పందంపై సంతకాలు. రూ.250 కోట్లతో ఏర్పాటు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరం వద్ద ఏర్పాటు. గంటకు 60 టన్నుల ఉత్పత్తి. 25 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుచేస్తున్న రైతులకు ఉపయోగకరం. 1500 మందికి ఉద్యోగావకాశాలు. 50 వేలమంది రైతులకు ప్రయోజనకరం.
ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే….
ఈరోజు దాదాపుగా 13 యూనిట్లకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఒక యూనిట్ కోసం ఎంఓయూ కుదుర్చుకున్నామన్నారు. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో 386 ఎంఓయూలు, దాదాపు రూ.13లక్షల పెట్టుబడులకు సంబంధించి చేసుకున్నామన్నారు. ప్రతినెలా ఈ ఎంఓయూలు కార్యరూపంలోకి రావాలని సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. పారిశ్రామిక వేత్తలతో చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తున్నామన్నారు. వారి అవసరాలను తీర్చేలా ముందడుగులు వేస్తున్నామన్నారు. దేవుడి దయతో అందులో భాగంగా 13 యూనిట్లు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామన్నారు. ఇవాళ ౩ ప్రారంభోత్సవాలు, 9 శంకుస్థాసనలు, ఒక ఎంఓయూ కుదుర్చుకున్నామని చెప్పారు. దాదాపుగా 8వేలమందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయని, 14 జిల్లాల్లో ఈ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. చట్టం వల్ల ఈ పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. తద్వారా స్థానికుల నుంచి మంచి సహకారం లభిస్తుందన్నారు. 6 నుంచి 18 నెలల్లో శంకుస్థాపన చేసుకున్న పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభిస్తాయని తెలిపారు. పరిశ్రమలు పెడుతున్న యాజమాన్యాలందరికీ, ఉద్యోగులకూ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.