AP BJP President: ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన!

  • ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన
  • పీవీఎన్‌ మాధవ్ పేరు ఖరారు
  • నేడు అధికారికంగా ప్రకటించనున్న బీజేపీ
Pvn Madhav

Pvn Madhav

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నూతన అధ్యక్షుడి పేరును ఈరోజు అధిష్టానం ప్రకటించనుంది. మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్‌ మాధవ్ పేరు నిన్ననే ఖరారు కాగా.. నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈరోజు ఉదయం 10:45కు అధ్యక్షుని పేరును ప్రకటిస్తారు. అనంతరం పదవీ ప్రమాణం, బాధ్యతల స్వీకరణ ఉంటుంది. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధికారికంగా నిర్వహించనున్నారు. కర్ణాటక ఎంపీ మోహన్‌ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు.

సోమవారం మధ్యాహ్నం ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నామినేషన్ల గడవు ముగిసింది. పీవీఎన్‌ మాధవ్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. ఒకే నామినేషన్ వేయడంతో.. ఏపీ బీజేపీ చీఫ్‌ పేరు నిన్ననే ఖరారు అయింది. పీవీఎన్ మాధవ్‌కు బీజేపీ, దాని అనుబంధ సంస్థల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాధవ్.. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేవైఎంలో ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన కుటుంబం కూడా పార్టీ కుటుంబంగానే చెప్పుకోవాలి. బీజేపీ సీనియర్‌ నేత, దివంగత చలపతిరావు కుమారుడే మాధవ్‌. చలపతిరావు రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు.

Also Read: ENG vs IND: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సెలక్షన్‌కు అందుబాటులోనే బుమ్రా!

ఏపీ బీజేపీ కాబోయే నూతన అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్ ఈరోజు ఉదయం 9 గంటలకు బెజవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం స్ధానిక కన్వెన్షన్‌లో జరిగే పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. పీవీఎన్‌ మాధవ్ పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్‌. 1973 ఆగస్టు 10న విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో ఆయన జన్మించారు.