ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు జరుగుతోంది. సభా నిర్వహణ విషయంలో కీలకాంశాలను యమమల రామకృష్ణుడు ప్రస్తావించారు. పూర్తి స్థాయి బడ్జెట్, ఓటాన్ అకౌంట్, ఆర్డినెన్స్ జారీ వంటి వాటిల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యనమల రామకృష్ణుడు సలహాలు ఇచ్చారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల మాట్లాడుతూ.. ఈ నెలాఖరుతో గత ప్రభుత్వం ఆమోదించిన ఓటాన్ అకౌంట్ గడువు ముగియనుంది. గడువు ముగిసేలోగా బడ్దెట్ లేదా ఓటాన్ అకౌంట్ లేదా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్సుకు ఆమోదం లేకుంటే ప్రభుత్వం ట్రెజరీ నుంచి డబ్బులు డ్రా చేయలేదని ఆయన అన్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడమో లేక ఓటాన్ అకౌంట్ ఆమోదించడమో చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేసే ఆలోచన ఉన్నట్టు కన్పిస్తోందన్నారు యనమల. ప్రస్తుతమున్న సభ ప్రొరోగ్ చేయలేదు కాబట్టి.. ఆర్డినెన్స్ జారీ చేయడం కుదరదని, సభ ప్రొరోగ్ కాని టైంలో ఆర్డినెన్సులను జారీ చేయడం నిబంధనలకు విరుద్దమన్నారు. ఈ పరిస్థితుల్లో సభలో పూర్తి స్థాయి బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ పెట్టి ఆమోదించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేయాలని భావిస్తే గవర్నర్ ప్రసంగం చేయించి సభను ప్రోరోగ్ చేయాలని, సభను ప్రొరోగ్ చేసిన తర్వాతే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలన్నారు యనమల. ఈ ప్రక్రియల్లో ఏదీ చేయాలన్నా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వం ఈ సాంకేతికాంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గత ప్రభుత్వం అసెంబ్లీని సరిగా నిర్వహించ లేదని, ప్రజా సమస్యలపై చర్చిండానికంటే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడానికే సభ అన్నట్టు జగన్ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సభా నిర్వహణ కంటే దారుణంగా ఏపీ అసెంబ్లీని నడిపిన ఘనత జగనుకే దక్కిందని, ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ పని దినాలకంటే ఏపీ అసెంబ్లీ పని దినాలు తక్కవగా ఉన్నాయని ఆయన అన్నారు. సుమారు 16 పని దినాలు ఈశాన్య రాష్ట్రాలకంటే తక్కువగా ఏపీ అసెంబ్లీ పని దినాలు ఉన్నాయి.