అమరావతిలో ఈరోజు ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు. లడ్డు కల్తీ ఆరోపణలు, నిరుద్యోగ భృతి అంశం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి విషయాలపై ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Also Read: Usman Tariq Bowling: వీధుల్లో ఆడే పిల్లలు కూడా బౌలింగ్ చేస్తారు.. ఉస్మాన్ తారిక్పై సెహ్వాగ్ ఫైర్!
వైసీపీ సభ్యుల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. కొందరు సభ్యులు స్పీకర్ చైర్ వైపు పేపర్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. సభలో క్రమశిక్షణ పాటించాలంటూ స్పీకర్ సూచించినప్పటికీ.. వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. అనంతరం సభను బహిష్కరిస్తూ వాకౌట్ చేశారు. ఈ సంఘటనతో అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా మరింత వేడెక్కాయి. ప్రభుత్వ-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురే అవకాశాలు కనిపిస్తున్నాయి.
