హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల పుట్ట కదులుతోంది.. సీఐడీ దర్యాప్తులో మరో భారీ స్కాం వెలుగుచూసింది. సమ్మర్ క్యాంప్ల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు హెచ్సీఏ కేటుగాళ్లు. తప్పుడు లెక్కలు చూపించి కేవలం ఒక్క నెల రోజుల్లోనే ఏకంగా 4 కోట్ల రూపాయలు కాజేశారు జగన్మోహన్రావు అండ్ కో. ఆటగాళ్లు శిక్షణ ఇవ్వకుండానే ఇచ్చినట్టు.. ఓ బ్యాటు.. ఓ బాల్ మాత్రమే ఇచ్చి.. కిట్ మొత్తం ఇచ్చినట్టు సృష్టించారు. సీఐడీ దర్యాప్తు లో HCA డొంక కదిలి… రోజుకో అవినీతి బయటపడుతోంది.
Also Read:Sundarakanda: ఆగస్టు 27న నారా రోహిత్ ‘సుందరకాండ’
లేనిది ఉన్నట్టు… ఉన్నది లేనట్టు చేయడం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి వెన్నతో పెట్టిన విద్య. మాయామశ్చింద్ర చేయడంలో HCA ను మించినోళ్లు బహుషా దొరకకపోవచ్చు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన హెచ్సీఏ లో స్కాంల పర్వం వెలుగుచూస్తోంది. ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసి… దర్యాప్తు చేస్తున్న సీఐడీ.. హెచ్సీఏ అక్రమార్కుల భరతం పడుతోంది. తాజాగా మరో స్కాంను వెలికితీశారు సీఐడీ అధికారులు.
Also Read:Off The Record: విశాఖ అయోధ్య మందిరం సెట్ వెనుక బీజేపీ ఎంపీ ఉన్నారా..?
కక్కుర్తికి కాదేదీ అనర్హమన్నట్టు దోచుకున్నారు హెచ్సీఏ అక్రమార్కులు. సమ్మర్ క్యాంప్ల పేరుతో కేవలం నెల రోజుల్లోనే ఏకంగా 4 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు అండ్ కో. గతేడాది ఏప్రిల్ 20 నుంచి మే 20 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సమ్మర్ క్యాంపులు నిర్వహించింది హెచ్సీఏ. ఒక్కో క్యాంపులో 80 నుంచి 100 మంది విద్యార్థుల చొప్పున.. మొత్తంగా నెల రోజుల్లో 2500 మందికి క్రికెట్ కోచింగ్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించారు. క్యాంప్లో ఎక్స్పీరియన్స్డ్ కోచ్ల ద్వారా శిక్షణ ఇప్పించినట్లు పేర్కొన్నారు. క్యాంప్ కి హాజరైన స్టూడెంట్స్కు క్రికెట్ కిట్స్ ఉచితంగా అందజేసినట్లు చూపించింది హెచ్సీఏ.
Also Read:Cyclone and Heavy Rains: భారీ వర్షాలపై సర్కార్ హైఅలర్ట్.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కానీ… సీఐడీ దర్యాప్తులో ఇందుకు పూర్తిగా భిన్నంగా తేలింది. ఒక్కో క్యాంపులో కనీసం 10 నుంచి 15 మంది కూడా లేనట్లు గుర్తించారు సీఐడీ అధికారులు. కోచింగ్ ఇచ్చింది కూడా సాధారణ వ్యక్తే అని.. తనకు ఇచ్చింది కూడా వందలు, వేల రూపాయలే. కానీ.. ఇచ్చినట్లు లెక్కల్లో చూపింది మాత్రం లక్షలు. క్యాంప్ కి హాజరైన స్టూడెంట్స్ కి ఓ బాల్… ఓ బ్యాట్ అందజేసిన హెచ్సీఏ పెద్దలు…. లెక్కల్లో చూపింది మాత్రం ఏకంగా కిట్ ఇచ్చినట్లు. వందల రూపాయల బాల్ చేతిలో పెట్టి… కోట్లల్లో కొల్లగొట్టారు. హెచ్సీఏ నిధులకు ఎగనామం పెట్టారు.
Also Read:Telangana: తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
హెచ్సీఏ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ సమ్మర్ క్యాంప్లు నిర్వహించారు… ఎంత మంది వచ్చారు.. కోచ్లు ఎవరు.. వాళ్లకు ఇచ్చిన జీతం ఎంత.. స్టూడెంట్స్ కి ఇచ్చింది ఏంటి…! ఇలా మొత్తంగా ఒక్కో క్యాంప్ పై ఎంత ఖర్చు చేశారు.?? లెక్కల్లో చూపింది ఎంత అనేది పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు సీఐడీ అధికారులు. సీఐడీ దర్యాప్తులో తవ్విన కొద్దీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహనరావు, సెక్రెటరీ దేవరాజు, సీఈఓ సునీల్ కాంటే.. ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కూపీ లాగుతోంది సీఐడీ.