Bihar IPL Team: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ అయిన Indian Premier League (IPL) రోజురోజుకూ మరింత విస్తరిస్తోంది. క్రికెట్ అభిమానులతో పాటు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఐపీఎల్పై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే బీహార్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్లా.. బీహార్కు కూడా ఒక ఐపీఎల్ జట్టు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్లో ప్రతిభకు కొదవ లేదని, అయినా ఆ రాష్ట్రానికి ఇప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడం బాధ కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.
బీహార్ నుంచి వెలుగొందుతున్న క్రికెటర్లు
అనిల్ అగర్వాల్ తన సోషల్ మీడియా పోస్టులో బీహార్కు చెందిన పలువురు యువ క్రికెటర్ల ప్రతిభను ప్రస్తావించారు. పాట్నాకు చెందిన ఇషాన్ కిషన్ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందారని చెప్పారు. అలాగే సమస్తిపూర్కు చెందిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడని గుర్తు చేశారు. మరోవైపు గోపాల్గంజ్కు చెందిన సాకిబ్ హుస్సేన్ తన అద్భుతమైన బౌలింగ్తో గుర్తింపు తెచ్చుకుంటున్నాడని పేర్కొన్నారు.
“బీహార్కు సరైన గుర్తింపు రావడం లేదు”
“క్రికెట్లో బీహార్కు దక్కాల్సిన గుర్తింపు ఇప్పటికీ రావడం లేదు అనే విషయం నన్ను ఎప్పుడూ బాధిస్తుంది” అని పేర్కిన్నారు అనిల్ అగర్వాల్.. బీహార్ యువతకు సరైన మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహం లభిస్తే ప్రపంచ స్థాయి జట్టును నిర్మించగల సామర్థ్యం ఉందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. క్రీడాకారులు తమ రాష్ట్రంలోనే ప్రపంచ స్థాయి శిక్షణ, సౌకర్యాలు పొందాలని తన కల అని చెప్పారు.
క్రీడలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం
బీహార్ క్రికెట్ అభివృద్ధికి తాను పూర్తిగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అనిల్ అగర్వాల్ స్పష్టం చేశారు. “నాకు బీహార్ కేవలం ఒక రాష్ట్రం కాదు.. అది ఒక భావోద్వేగం” అని ఆయన పేర్కొన్నారు. బీహార్ యువతకు సరైన అవకాశాలు కల్పిస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అక్కడి నుంచే వస్తుందని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం విస్తరించిన అనిల్ అగర్వాల్
కాగా, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ బీహార్ వాస్తవ్యులు.. బీహార్లోనే జన్మించి పెరిగిన ఆయన.. ప్రస్తుతం తన వ్యాపార సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు.. ఆయన నికర ఆస్తి విలువ వేల కోట్ల రూపాయలుగా అంచనా వేయబడుతోంది. ఇప్పుడు ఆయన చేసిన “బీహార్ ఐపీఎల్ జట్టు” వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. చాలామంది క్రికెట్ అభిమానులు కూడా బీహార్కు ఐపీఎల్ జట్టు రావాలని అభిప్రాయపడుతున్నారు.. అనిల్ అగర్వాల్ మాటలు చూస్తుంటే.. బీహార్ జట్టే ఏర్పాటు అయితే.. ఆయనే ఓనర్ కూడా అవుతారేమో చూడాలి..
क्या आपको नहीं लगता Chennai Super Kings, Mumbai Indians और Kolkata Knight Riders की तरह बेमिसाल बिहार की भी एक टीम होनी चाहिए?
बिहार की मिट्टी ने देश को बहुत से बेहतरीन क्रिकेट खिलाड़ी दिए हैं।
पटना में जन्मे ईशान किशन ने सबसे कम गेंदों में ODI double century लगाई। समस्तीपुर… pic.twitter.com/bgScCh40Zd
— Anil Agarwal (@AnilAgarwal_Ved) May 22, 2026
